Subhash Chandra bose | తొలిదశ భారతీయ విప్లవకారుడు రశ్ బిహారీ బోస్. కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) ఏర్పాటుచేశారు. దానికి సుభాష్ చంద్ర బోస్ 1943 అక్టోబర్ 21న పునరుజ్జీవం ప్రసాదించాడు.
ఐఎన్ఏ స్థాపనలో జపాన్ సహకారం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరఫున పోరాడేందుకు తూర్పు దేశాలకు భారతీయ సైనికులు వెళ్లారు. అయితే సింగపూర్ను జపాన్ ఆక్రమించుకున్న తర్వాత వారిలో దాదాపు 45,000 మంది యుద్ధఖైదీలుగా పట్టబడ్డారు. బ్రిటిష్ సైన్యాలు, వారికి సహాయంగా ఉన్న మిత్రపక్షాల సైన్యాలతో భారత జాతీయ సైన్యం దళాలు జపాన్ సైనికులతో కలిసి యుద్ధంలో పాల్గొన్నారు. అలా బర్మా, ఇంఫాల్, కోహిమాలో జరిగిన యుద్ధాల్లో ఐఎన్ఏ సైనికులు పోరాడారు.
సింగపూర్లో 1943 అక్టోబర్ 21న ఆజాద్ హింద్ ప్రొవిజనల్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. రాజ్యాధిపతి, ప్రధానమంత్రి, యుద్ధమంత్రిగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తనను తాను ప్రకటించుకున్నాడు. ఈ ప్రభుత్వాన్ని వివిధ దేశాలు గుర్తించాయి. దాంతో బ్రిటిష్ వలస పాలనలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకునేందుకు ఐఎన్ఏ బయల్దేరింది. అప్పటికే నేతాజీ భారత స్వాతంత్య్ర సమరంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి, విదేశాల్లోనూ ఆయన పేరు ప్రముఖంగా తెలుసు.
అలా భారత జాతీయ సైన్యాన్ని ఆయన విజయవంతంగా నడపగలరని భావించారు. అంతేకాకుండా ఎంతోమంది పౌరులను కూడా ఐఎన్ఏ పోరాటంలో పాల్గొనే దిశగా స్ఫూర్తి నింపగలిగాడు. పైపెచ్చు తన వెంట నడవడానికి మహిళలను కూడా చైతన్య పరచగలిగాడు. ఈ క్రమంలోనే 1943 అక్టోబర్లో రాణి లక్ష్మీబాయి రెజిమెంట్ పేరుతో మహిళా పటాలం ఏర్పడింది. దీనికి లక్ష్మీ సెహగల్ నాయకత్వం వహించారు.
వీటన్నిటికి మించి భారతీయులకు మద్దతు ఇవ్వడానికి జపాన్ ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపాడు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిన జపాన్ అమెరికా మిత్రపక్షాలకు లొంగిపోయింది. దీంతో సింగపూర్ రేడియో నుంచి 1945 ఆగస్టు 15న భారత జాతీయ సైన్యం పాత్ర ముగిసిందని నేతాజీ ప్రకటించాడు. ఆ తర్వాత మూడు రోజులకు ఓ విమాన ప్రమాదంలో మరణించాడని అంటారు.