లక్నో: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఒక బాలిక గత రెండేండ్లుగా జట్టు తింటున్నది. ఈ విషయాన్ని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ఆమె కడుపులో పేరుకుపోయిన రెండు కిలోల వెంట్రుకల ముద్దను బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 17 ఏండ్ల బాలిక రెండేండ్లుగా బలహీనంగా మారతున్నది. ఆమె తల జట్టు రాలిపోవడాన్ని కూడా కుటుంబ సభ్యులు గమనించారు. కాగా, పది రోజుల కిందట ఆ బాలిక కడుపు నొప్పి, వాంతులతో బాధపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను బలరాంపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
శస్త్రచికిత్స విభాగానికి చెందిన డాక్టర్ ఎస్ఆర్ సందార్ ఆమెను పరీక్షించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా ఆ అమ్మాయి కడుపులో ఒక గడ్డ కనిపించింది. వైద్యులు CT స్కాన్ చేయగా అందులోనూ పెద్ద గడ్డ కనిపించింది. ఎండోస్కోప్ ద్వారా పరిశీలించగా బాలిక పొత్తికడుపులో జుట్టు ఉన్నది. దీంతో గంటన్నరపాటు శస్త్రచికిత్స చేసి రెండు కిలోల బరువైన వెంట్రుకల ముద్దను ఆమె కడుపు నుంచి తొలగించారు. కాగా, ఆ బాలిక కడుపులో 20 సెంటీమీటర్ల వెడల్పు మేర జట్టు ముడిపడి చుట్టుకుని ఉండటం చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.
ఆ బాలికకు పుట్టినప్పటి నుంచే మానసిక వ్యాధి ఉన్నదని వైద్యులు తెలుసుకున్నారు. అంతేగాక ఆమె అరుదైన ట్రైకోబెజోవర్ వ్యాధితో బాధపడుతున్నదని గ్రహించారు. ఈ వ్యాధి ఉన్న వారు తమ తల జట్టును పీక్కొని తింటారని వైద్యులు చెప్పారు. ఈ బాలిక ఇలా తన తల జుట్టును పీక్కొని తినడం వల్ల ఆమె కడుపులో వెంట్రుకలు పేరుకుపోయాయని అన్నారు. దీంతో ఆమె తినే ఆహారం జీర్ణం కాకపోవడంతో 32 కేజీల బరువు తగ్గిందని వివరించారు. కడుపులోని వెంట్రుకలు ఉండలు కట్టడంతో ఆహారం పేగుల్లోకి వెళ్లలేక కడుపు నొప్పి, వాంతులతో ఆమె బాధపడినట్లు డాక్టర్లు వెల్లడించారు.