హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. కేవలం వారం వ్యవధిలోనే రోజువారీ కేసుల సంఖ్య దాదాపు పది రెట్లు పెరిగింది. ఈ నెల 2న రాష్ట్రంలో 274 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8న 2,606 కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు కూడా మూడు రెట్లు పెరిగింది. ఈ కాలంలో పాజిటివిటీ రేటు 1.26 నుంచి 3.56 శాతానికి ఎగబాకింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,779 నుంచి 12,180కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే ఉంటున్నాయి.
ఈ మూడు జిల్లాల్లో సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. జీరో కేసులున్న జిల్లాల్లోనూ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 2 వరకు 20 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 8న ములుగు మినహా అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవ్వడం వైరస్ వ్యాప్తి తీవ్రతను సూచిస్తున్నది. కేవలం 14 జిల్లాల్లో పది లోపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక జిల్లాల్లో కేసుల సంఖ్య 10-15 రెట్లు పెరిగింది.