కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 1 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు మంజూరైన నిధులతో పనులను వేగవంతంగా పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు. మంగళవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, ఇరిగేషన్, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో పాటు జంట సర్కిళ్ల కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలతో పాటు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు, జరుగుతున్న నిర్మాణ పనులపై అధికారులతో కూలంకుషంగా చర్చించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన చేపట్టేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించేలా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు ప్రశాంతి, మంగతాయారు, మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్, సురేశ్రెడ్డి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా మంగళవారం చింతల్ క్యాంపు కార్యాలయం వద్ద 348 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 84 లక్షల 19 వేల 544 రూపాయల విలువ గల చెక్కులను అందించారు. కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు పార్టీ శ్రేణులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.