సుల్తానాబాద్ పీఏసీఎస్ అంచలంచెల ప్రగతి సాధిస్తున్నది. ఏటేటా తన లాభాలను పెంచుకుంటూ.. సహకారం.. సేవల్లో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. 2013 వరకు సీ గ్రేడ్లో ఉన్న సంఘం, క్రమంగా తన గ్రేడ్ను పెంచుకుంటూ రాష్ట్రంలోని 11 ఏ ప్లస్ గ్రేడ్ సంఘాల్లో ఒకటిగా నిలిచింది. ఏడాదికి 75.74 కోట్ల టర్నోవర్ చేస్తూ.. 52.39 లక్షల నికర లాభాలను మూటగట్టుకుంటున్నది. సంఘం, వ్యాపారంలోనూ దూసుకెళ్తున్నది. రైతుల సహకారంతో ఎరువులు, పురుగుమందులు, నీళ్లు, సూపర్ మార్కెట్, వడ్లు, బియ్యం విక్రయాల్లోనూ గణనీయమైన ప్రగతిని సాధిస్తూ, ఇటీవలే రాష్ట్రస్థాయి పురస్కారాన్ని దక్కించుకున్నది. హైదరాబాద్ రీజియన్ పరిధిలో ఎక్సలెన్స్, మెరిట్ విభాగంలో 2వ స్థానాన్ని దక్కించుకొని గత నెల 28న కరీంనగర్ వేదికగా జరిగిన కేడీసీసీబీ శతాబ్ధి ఉత్సవాల్లో అవార్డును అందుకున్నది.
పెద్దపల్లి, జనవరి 6(నమస్తే తెలంగాణ): సుల్తానాబాద్ పీఏసీఎస్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. రైతుల సహకారంతో రోజు రోజుకూ తన లాభాలను పెంచుకుంటూ పోతున్నది. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎమ్మెల్యే దాసరి సహకారంతో అంచలంచెలుగా ఎదుగుతున్నది.
1958లో ఏర్పాటు..
సుల్తానాబాద్ పీఏసీఎస్ 1958లో గూడ రాధకిషన్రావు ఆధ్వర్యంలో 230మంది సభ్యులతో పురుడుపోసుకున్నది. తొలి చైర్మన్గా గూడ రాధాకిషన్రావు.. అనంతరం ముస్త్యాల లక్ష్మయ్య, బిరుదు రాజమల్లు, దుగ్యాల లింగారావు, పారుపల్లి వైకుంఠపతి, అంతటి అన్నయ్యగౌడ్, ఆకుల నర్సయ్య పనిచేశారు. ఆకుల నర్సయ్య చైర్మన్గా ఉన్న సమయంలో పీఏసీఎస్కు 11 గుంటలు కొనుగోలు చేసి ఆ భూమిలో పీఏసీఎస్కు భవనాలు నిర్మించారు. 2013 జనవరిలో ప్రస్తుత చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు.
ఆ తర్వాత స్వరాష్ట్రం ఏర్పడడం, సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ మరింత చొరవ చూపడంతో పీఏసీఎస్ను ఆదర్శంగా నిలిపేందుకు శ్రీగిరి శ్రీనివాస్ అన్ని చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే దాసరి సహకారంతో రూర్బన్ పథకం కింద కోటితో వ్యవసాయ మార్కెట్ పక్కన 30 గుంటలు కొనుగోలు చేసి ఆ స్థలంలో గోదాం, సీడ్ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. సంఘం లాభాలను ఇంటలెక్ట్ సాఫ్ట్వేర్కు అనుసంధానం చేసి ఆ సాఫ్ట్ వేర్ ద్వారా ఏ రోజుకారోజు ఆన్లైన్ చేసి పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.
అంచలంచెలుగా..
సుల్తానాబాద్ పీఏసీఎస్ స్వరాష్ట్రంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. 230 మందితో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం 3200 మందితో పటిష్టంగా తయారైంది. గతంలో రైతులకు రుణాలను మాత్రమే ఇచ్చే పీఏసీఎస్ను కొత్త పుంతలు తొక్కించారు. 3.84 కోట్లుగా ఉన్న పంట రుణాలను 9 కోట్లకు పెరిగే విధంగా కృషి చేశారు. అలాగే, దీర్ఘకాలిక రుణాలను 3.50 కోట్ల నుంచి 24 కోట్లకు పెంచారు. సొసైటీలో గతంలో ముగ్గురు మాత్రమే సిబ్బంది ఉండగా అవసరానికి అనుగుణంగా 12 మందికి పెంచుకున్నారు.
2013లో సభ్యుల వాటా ధనం 48 లక్షలు ఉండగా, ఇప్పుడు అది 2.15కోట్లకు పెరిగింది. సంఘం యాక్ట్ ప్రకారం 6 శాతం వాటా రైతులకు అందించాల్సి ఉండడంలో సంఘంలోని 3200 మంది సభ్యులకు 12.59 లక్షలను పంచారు. మరోవైపు సంఘం లాభాల బాటలో పయనిస్తుండడంతో డిపాజిట్లు అమాంతం పెరిగిపోయాయి. 2013 వరకు లక్షల్లో ఉండగా, ప్ర స్తుతం కోట్లల్లోకి పెరిగాయి. 2020-21లో సం ఘం డిపాజిట్లు రూ.1,81,98,064 కాగా, సభ్యు ల డిపాజిట్లు రూ.71,17,983గా ఉన్నాయి.
వ్యాపారంలో దూకుడు..
ఎరువులు, పురుగు మందుల విక్రయాలు, పంట కొనుగోళ్లు, బియ్యం విక్రయాలు, సూపర్మార్కెట్ నిర్వహణ సహా పలు వ్యాపారాల్లో సుల్తానాబాద్ పీఏసీఎస్ దూసుకెళ్తున్నది. ఇఫ్కో, క్రిబ్కో, కోరమాండల్ డీలర్ షిప్లను తీసుకొని నాణ్యమైన ఎరువులు, పురుగుమందులను బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నది. దాదాపుగా ఏడాదికి ఫర్టిలైజర్పై 1.3కోట్ల వ్యాపారం చేస్తున్నది. ఇక నాణ్యమైన విత్తనాలు విక్రయిస్తూ ఏడాదికి 22.01కోట్ల వ్యాపారం చేస్తున్నది.
గతంలో కేవలం మూడు కొనుగోలు కేంద్రాలు ఉండగా, రైతుల అవసరాలకు అనుగుణంగా 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏడాదికి 41.60 కోట్ల వ్యాపారం చేస్తున్నది. రైతుల వద్ద సాంబమసూరి వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్చి వాటిని కూడా విక్రయిస్తూ, ఏడాదికి 6.17లక్షల వ్యాపారం చేస్తున్నది. నాణ్యమైన సరుకులను రైతులకు విక్రయించేందుకు సూపర్ మార్కెట్ను అందుబాటులోకి తెచ్చి, ఏడాదికి 45.24లక్షల వ్యాపారం చేస్తున్నది. నాణ్యమైన తాగునీటిని అందించేందుకు వాటర్ ఫ్యూరిఫైడ్ ప్లాంట్ను ఏర్పాటు చేసి కేవలం 10కే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తున్నది.
వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లు తీసుకొని కూల్ వాటర్ను సైతం అందిస్తున్నది. ఇలా నీటి వ్యాపారంపై ఏడాదికి 6.14 లక్షల వ్యాపారం చేస్తున్నది. స్వల్పకాలిక రుణాలతో 9.13 లక్షలు, దీర్ఘకాలిక రుణాలతో 23.49 లక్షలు, రైతులకు బైక్ల రుణాల ద్వారా 80.55 లక్షలు, బంగారం రుణాలపై 1.17లక్షల వ్యాపారం చేస్తున్నది. కేడీసీసీ బ్యాంకు ద్వారా సహకార సంఘం తీసుకునే రుణాల ద్వారా వచ్చే 1.5 శాతం కమీషన్ సైతం లభిస్తున్నది. ఇలా ఒక్క ఏడాదిలో అన్ని వ్యాపారాల్లో 75.74 కోట్ల టర్నోవర్ చేస్తుండగా ఇందులో గ్రాస్గా 86.10లక్షల ప్రాఫిట్ లభిస్తున్నది. ఖర్చులు, మెయింటెనెన్స్ అన్నీ పోనూ సంఘానికి ఏడాదికి 52.39లక్షల నికర లాభాలు వస్తున్నాయి.
ఉత్తమ సేవలకు పురస్కారం
సుల్తానాబాద్ సహకారం సంఘం పనితీరుకు ఇటీవలే రాష్ట్రస్థాయి పురస్కారం వరించింది. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలంగాణను హైదరాబాద్ రీజియన్గా పరిగణించి ప్రకటించిన రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ అండ్ మెరిట్ అవార్డ్స్లో ద్వితీయ స్థానంలో నిలిచి నగదు అవార్డును సొంతం చేసుకున్నది. సహకార సంఘాలు, అర్బన్ బ్యాంకులు, మహిళా సహకార సంఘాల విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గత నెల 28న కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలలో జరిగిన కేడీసీసీబీ శతాబ్ది ఉత్సవాల్లో మంత్రులు గంగుల, కొప్పుల, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చేతుల మీదుగా చైర్మన్ పురస్కారంతోపాటు 20 వేల నగదు బహుమతి అందుకున్నారు.
అందరి సహకారంతో ముందుకు
సుల్తానాబాద్ పీఏసీఎస్ సభ్యులం దరి సంపూర్ణ సహాయ సహకా రా లు, నాఫ్స్కాబ్ చైర్మ న్ కొండూరు రవీందర్రావు, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రోత్సాహంతోనే ఆదర్శంగా ముందుకు సాగుతున్నది. రైతులకు ఎప్పుడు ఏది అవసరమో వాటిని గుర్తించి అందుకు అనుగుణంగా సేవలను అందిస్తున్నది. రాబోయే రోజుల్లో రైతు వ్యవసాయ పరికరాల విక్రయాలు, ఐఎస్ఐ మార్క్తో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి నీటి విక్రయాలు, పెట్రోల్ బంక్, ఆయిల్ స్టోర్లను సైతం ఏర్పాటు చేస్తాం. రైతు ప్రతి అవసరా న్ని తీర్చాలన్నదే మా లక్ష్యం. ఇలా పీఏసీఎస్ ద్వారా ఏ వ్యాపారం చేసినా ఆ లాభం రైతు కు చేకూరుతుంది. సుల్తానాబాద్ పీఏసీఎస్ కు అవార్డు రావడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. మరింత గొప్పగా పనిచేస్తాం.