షాబాద్, అక్టోబర్ 23 :షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను పునఃప్రారంభించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణా అన్ని జిల్లాల షె.కు. శాఖ జిల్లా అభివృద్ధి అధికారులకు ఆదేశించడంతో హాస్టళ్లు కళకళలాడాయి.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఒక ఆనంద నిలయం, 33 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటి నిర్వాహకులు, వసతిగృహ సంక్షేమ అధికారులు తమ విద్యార్థులకు వాట్సాప్, మెసేజ్ ద్వారా వసతిగృహాలు తెరిచినట్లు సమాచారం తెలియజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆహారాన్ని పరిశుభ్రమైన స్థలాల్లో వండించి వేడిగా ఉన్నప్పుడే విద్యార్థులకు వడ్డించాలని సూచిస్తున్నారు. వసతి గృహాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేసి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కొవిడ్-19 నుంచి రక్షణకై తగిన పరిశుభ్రత, సామాజిక దూరం, మాస్కుల వాడకం లాంటి సురక్ష విధానాలు, పద్ధతులు పాటించాలని ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను తక్షణమే అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించి తగిన చికిత్స అందించాలని ఆదేశాలు వచ్చినట్లు రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. ఆయా వసతి గృహాల్లో సిబ్బంది శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.