ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 9: గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతేకాకుండా పశువులు ఎక్కువగా ఉండటంతో గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వ చేసేవారు. అయితే ప్రస్తుతం సాగు విధానంలో అనే క మార్పులొచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. మిషన్తో హార్వెస్టింగ్ చేసే సమయంలో పైకి కోయడం ద్వారా కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొంత గడ్డిని కోసి తీసుకొచ్చుకుని మిగిలిన దానిని అక్కడే వదిలేస్తున్నారు. దీంతో దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతోపాటు గడ్డిని కూడాకాలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అధిక నష్టాలు వచ్చే అవకాశముందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరికొయ్యలను తగులబెట్టొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ఎనిమిది రోజుల ముందుగా దున్నాలి..
రైతులు చాలామంది వరినాటు వేసే సమయంలో మొదటి దఫా దున్నుడుకు, రెండో దఫా దున్నుడుకు మధ్య నాలుగు నుంచి ఐదురోజుల సమయం మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల వరికొయ్యలు(కొయ్యకాలు), గడ్డి త్వరగా కుళ్లిపోవు. ఇలాంటి సమయంలో పశువులను అందులో వదిలితే అటూ తిరగడం, పొలం లో పేడ, మూత్ర విసర్జన చేయడం ద్వారా త్వరగా కుళ్ల్లిపోయి భూసారంతోపాటు పంట దిగుబడి 5 శాతం పెరుగుతుంది. లేదంటే అందులోనే కలియదున్ని కనీసం ఎనిమిది రోజుల సమ యం తీసుకుని రెండోసారి దున్నాలి. వీలైతే మొదటి దఫాలో ఒక్కసారి రోటోవేటర్తో దున్నితే గడ్డి, కొయ్యకాలు చిన్న, చిన్న ముక్కలుగా విడిపోయి మరోసారి దున్నినప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. దున్నే ముందు ఎకరానికి క్వింటాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లితే వరికొయ్యలు, గడ్డి త్వరగా కుళ్ల్లిపోతా యి. జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలు వేసి ఏపుగా పెరిగిన తర్వాత కలియదున్నితే భూమి సారవంతంగా మారుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
సారాన్ని కోల్పోతుంది
వరికొయ్యలను (కొయ్యకాలు) కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. కాల్చడం ద్వారా విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్ఫరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. దిగుబడీ పోతుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి. పం టలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి. పొలాల్లో తిరిగే పాములు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గరే ఉన్న ధాన్యం కాలిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
పొలాన్ని కలియ దున్నితే కలిగే ప్రయోజనాలు
గాలి, నేల కలుషితమవుతుంది
వరికొయ్యలకు (కొయ్యకాలు) నిప్పు పెట్టడం వల్ల గాలి, నేల కలుషితమవుతుంది. పంటలకు మేలుచేసే మిత్ర పురుగులు మరణిస్తాయి. వరికొయ్యలను పొలంలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఎకరానికి దాదాపు టన్ను ఎరువు తయారవుతుంది. దున్నే ముందు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లితే వరికొయ్యలు, గడ్డి మొక్కలు తొందరగా కుళ్ల్లిపోతాయి. మురిగిన కొయ్యలు ఎరువుగా మారడటంతో దిగుబడి పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించొచ్చు.
-రఘు, వ్యవసాయశాఖ ఏఈవో ఇబ్రహీంపట్నం