ముంబై: రాఖీ సావంత్(Rakhi Sawant) చిక్కుల్లో పడింది. ఆమె దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ను కోర్టు తిరస్కరించింది. ముంబైలోని దిందోషి కోర్టు ఆ పిటీషన్ను కొట్టిపారేసింది. జనవరి 8వ తేదీన జరిగిన విచారణలో అదనపు సెషన్స్ జడ్జి శ్రీకాంత్ వై భోంసలే ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారమే ఆ ఆర్డర్కు చెందిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రైవేటు వీడియోలను రాఖీ సావంత్ లీక్ చేసినట్లు ఆమె మాజీ భర్త అనిల్ దురానీ కోర్టులో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ల ప్రకారం సావంత్పై అంబోలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాఖీ సావంత్ తనకు చెందిన ప్రైవేటు వీడియోలను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిందని దురానీ ఆరోపించారు. తనను ఓ బోగస్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాఖీ సావంత్ తరపు న్యాయవాది అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్ముక్ ఆరోపించారు. రాఖీ సావంత్ రిలీజ్ చేసిన వీడియోలు అసభ్యకరంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. కేసు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ జారీ చేయడం లేదని సెషన్స్ జడ్జి తెలిపారు.