హైదరాబాద్ : గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఇంజినీర్లతో నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖలోని ఇబ్బందులను పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 040-23390794లో సంప్రదించాలని సూచించారు.
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వానలతో దెబ్బతిన్న చెరువుల పరిస్థితులపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ప్రత్యేక బృందాల అధ్యయనం చేయనుండగా.. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.