రాజన్నసిరిసిల్ల జిల్లా దవాఖాన ప్రసవాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. నవంబర్ నెలలో రికార్డుస్థాయి కాన్పులు జరగడంతో ఆదర్శంగా నిలిచింది. ముందెన్నడూ లేనివిధంగా ఒక్క నెలలో 98 సాధారణ, 224 శస్త్రచికిత్సల ద్వారా పురుడు పోసి విశేష ఖ్యాతిని దక్కించుకున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో వైద్యశాల సిబ్బంది ఉత్సాహంగా విధులు నిర్వహిస్తుండగా, ఇక్కడ అందుతున్న సేవలపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నది.
సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 2: గతంలో సర్కారు దవాఖానలకు వెళ్లాలంటేనే భయపడాల్సి వచ్చేది. స్వరాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఇదే కోవలో సిరిసిల్ల ఏరియా దవాఖాన జిల్లా వైద్యశాలగా రూపుదిద్దుకున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ప్రసూతి విభాగంలో సకల సౌకర్యాలు కల్పించారు. ప్రైవేట్కు దీటుగా సేవలందిస్తున్నారు. ఒక్క నవంబర్లోనే 324 ప్రసవాలు చేయడం వారి పనితీరుకు మచ్చు తునకగా భావించవచ్చు.
అత్యాధునిక సౌకర్యాలు
జిల్లా దవాఖానలో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ హాస్పిటళ్లకు తీసిపోనివిధంగా అన్ని విభాగాల వార్డులను తీర్చిదిద్దారు. ఐసీయూ, డయాలసిస్, బ్లడ్ బ్యాంకు, ఈ-ఐసీయూ, కొవిడ్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, ఎల్వోటి, స్కానింగ్ సెంటర్ తదితర అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చా రు. సీటీజీ మెషిన్, ఫీటల్ డాప్లర్, అల్ట్రాసౌండ్ మెషిన్, అధునాతన ల్యాబొరేటరీ, హైడ్రాలిక్ ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేశారు. బరువు తక్కువ ఉండి, పసిరికలతో బాధపడుతున్న నవజాత శిశువుల చికిత్స కోసం ఎన్బీఎస్యూను నెలకొల్పారు. ప్రసూతి విభాగంలో ముగ్గురు గైనకాలజిస్టులతోపాటు 20మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేసేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు వారీగా వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో పాటు గైనిక్ విభాగంలో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలతో ప్రజల్లో అపారమైన నమ్మకం ఏర్పడింది. పీహెచ్సీల్లో గర్భిణులకు నెలనెలా పరీక్షలు చేసి అవసరమైన మం దులు ఇస్తున్నారు. అమ్మ ఒడిలో భాగంగా 102 అంబులెన్సుల్లో కాన్పు కోసం వచ్చిన మహిళలను సురక్షితంగా ఇటు దవాఖానకు, అటు ఇంటికి తరలిస్తున్నారు.
ఏడాదిలో జరిగిన కాన్పుల వివరాలు
2021లో మొత్తం 9931మంది గర్భిణులు ఓపీ విభాగంలో సేవలు పొందారు. అలాగే జనవరిలో 258 ప్రసవాలు జరిగాయి. ఇందులో 78 సాధారణం కాగా 180 ఆపరేషన్లు చేశారు. ఫిబ్రవరిలో 185 ప్రసవాలు చేయగా 57 సాధారణ, 128 ఆపరేషన్, మార్చిలో మొత్తం 246 ప్రసవాలు జరగగా 72 సాధారణ, 174 ఆపరేషన్, ఏప్రిల్లో 198 ప్రసవాలలో 57 సాధారణ, 141ఆపరేషన్, మేనెలలో 225 ప్రసవాలలో 63 సాధారణ, 162 ఆపరేషన్, జూన్లో 191 ప్రసవాలు చేయగా 67సాధారణ, 124 ఆపరేషన్, జూలైలో 231 ప్రసవాలలో 64సాధారణ, 167 ఆపరేషన్, ఆగస్టులో 262 ప్రసవాలలో 82సాధారణ, 180ఆపరేషన్, సెప్టెంబర్లో 288 ప్రసవాలలో 97 సాధారణ, 191ఆపరేషన్, అక్టోబర్లో 303 ప్రసవాలలో 94సాధారణ, 209 ఆపరేషన్, నవంబర్లో 324 ప్రసవాలలో సాధారణ 98, 224ఆపరేషన్లు జరిగాయి.
సిబ్బందికి అభినందన..
జిల్లా దవాఖానలో సిబ్బంది సహకారంతోనే గర్భిణులకు మెరుగైన సేవలందిస్తున్నామని సూపరింటెండెంట్ మురళీధర్రావు తెలిపారు. గురువారం దవాఖానలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసూతి విభాగంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో కార్పొరేట్కు దీటుగా అధునాతన సౌకర్యా లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. మిడ్ వైఫ్ శిక్షణ పొందిన సిబ్బంది సాధారణ ప్రసవాల కోసం తొలి ప్రాధాన్యత ఇస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఇక్కడ వైద్యు లు తిరుపతి, రఘు, సిబ్బంది ఉన్నారు.
కంటికి రెప్పలా చూసుకున్నరు..
మొదటి నెల నుంచి జిల్లా దవాఖన్లనే పరీక్షలు చేయించుకున్న. ప్రసవం కోసం ఇక్కడికే వచ్చిన. డాక్టర్లు మంచిగ చూస్తున్నరు. వచ్చే ముందట కొంత అనుమానపడ్డ. కానీ డాక్టర్లు, నర్సులు ఏ రాత్రి అవస్థ ఉన్న అవసరమైన మందులు ఇస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నరు.
ప్రైవేటుకు దీటుగా సేవలందిస్తున్నం..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లా వైద్యశాలలో అత్యాధునిక వైద్య సేవలు సమకూరాయి. గర్భిణులను 102 ద్వారా ఉచితంగా దవాఖానకు సురక్షితం గా తరలించి 24గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నం. వైద్యసిబ్బంది సహకారంతోనే సత్ఫలితాలు సాధించినం.
-మురళీధర్రావు, దవాఖాన సూపరిటెండెంట్