హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుసంస్కారి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో శనివారం ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడాలో తెలియక, విషయం లేక చిన్న మెదడు చితికి రాజగోపాల్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాధారణ వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్ దవాఖానకు వెళ్తే.. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు చూసి హాస్పిటల్కు వెళ్లారని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘ఆ రాష్ర్టాల్లో కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే మా కేంటి.. ఓడిపోతే మాకేంటి.. ఈ రెండు పార్టీలు కట్టగట్టుకొని ఎక్కడైనా దూకి చస్తే మాకేంటి..?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్ ది మాములు గుండె కాదు. కోట్లాది మంది ప్రజల అభిమానం పొందిన గుండె.. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించిన ఉక్కు గుండె. కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసం దవాఖానకు వెళ్తేనే.. యావత్ తెలంగాణ తల్లడిల్లింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోట్లాది మంది దేవుడిని ప్రార్థించారు’ అని పేర్కొన్నారు.