ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోశియారి ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్షను ఎదుర్కోవాలని పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేకంగా సమావేశం కానున్నది.
ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గం, బీజేపీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని బుధవారం బహిరంగంగా ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం జరిగే బలపరీక్షలో ఈ మేరకు వ్యవహరించనున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు.
మరోవైపు అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేసిన షిండే బృందం అక్కడి నుంచి విమానంలో గోవాకు బయలుదేరింది. గురువారం ఉదయం గోవా నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుని నేరుగా అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు. ఏక్నాథ్ షిండే వెంట 39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ప్రకటించారు.