న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల స్పందన భారీగా లభించింది. దీంతో ఈ ఆఫర్ 12.43 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది. స్టాక్ ఎక్సేంజీల్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం రెయిన్బో ఐపీవో ముగింపురోజైన శుక్రవారంనాటికి 25.49 కోట్ల షేర్లకు ఇన్వెస్టర్లు బిడ్ చేశారు.
సంస్థ 2.05 కోట్ల షేర్లను జారీచేస్తుండగా, దీనికి 12 రెట్లకు పైగా షేర్లకు డిమాండ్ ఏర్పడింది. సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యధికంగా బిడ్స్ వేశారు. ఈ విభాగంలో కేటాయించిన షేర్లకు 38.90 రెట్లు ఓవర్ సబ్స్రిప్షన్ లభించింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి తక్కువగా ఉండటంతో ఈ విభాగం 1.38 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. రూ.516-542 ధరల శ్రేణితో రూ. 1,580 కోట్లు సమీకరణ లక్ష్యంతో రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ పబ్లిక్ ఆఫర్ జారీచేసింది. ఐపీవో ప్రారంభానికి ముందురోజే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ. 470 కోట్లు సమీకరించింది. ఆఫర్లో చాలావరకూ ప్రస్తుత ఇన్వెస్టరు, ప్రమోటర్లు వారి వాటాల్ని విక్రయిస్తుండగా, రూ.280 కోట్ల విలువైన తాజా షేర్లను సంస్థ జారీచేసింది. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్ని కొత్త హాస్పిటల్స్ ఏర్పాటుకు ఖర్చుచేయాలని రెయిన్బో ప్రతిపాదించింది.