భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలు తీర్చేలా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రైల్వే లైను వేయాలన్న ప్రతిపాదనను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మరింత వేగంగా ముందుకు కదుపుతున్నది. రైల్వే లైనుకు అవసరమైన భూములను ఇప్పటికే సేకరించి ఉన్న నేపథ్యంలో ఇక రైల్వే లైనులు వేయాలని ప్రభుత్వం ద్వారా రైల్వేశాఖను కోరనున్నారు. ఔటర్ చుట్టూ ఉన్న రైల్వేస్టేషన్లు, 19 ఇంటర్ చేంజ్లను కలుపుతూ సాగే ఈ రైల్వే రింగు లైను.. మరో 4-5 ఏండ్లలో సాధ్యమయ్యే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
158 కిలోమీటర్లు.. 25 మీటర్ల వెడల్పు
ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రైల్వే మార్గం కోసం 158 కి.మీ పొడవునా 25 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకంగా భూమిని సేకరించి ఉంచారు. ఓఆర్ఆర్ లోపలి సర్వీసు రోడ్డు, ప్రధాన రహదారి మధ్యలో ఉన్న స్థలం… రెండు వరుసల రైల్వే మార్గం నిర్మించేందుకు అనుకూలంగా ఉంది. ఔటర్ రింగు రోడ్డును తాకుతూ నాలుగు దిక్కుల్లో ఉన్న రైల్వే లైన్ల వరకు ఈ రింగు లైను ఏర్పాటు చేయనున్నారు. నగరం నుంచి విజయవాడ వెళ్లే రైల్వే మార్గం ఘట్కేసర్ వద్ద, ముంబై వైపు వెళ్లే మార్గం మేడ్చల్ సమీపంలోని కండ్లకోయ- గౌడవెల్లి వద్ద, మరో రైల్వే లైను కొల్లూరు – ఈదుల నాగులపల్లి సమీపంలో, నాలుగోది శంషాబాద్ విమానాశ్రయం వద్ద బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో ఉంది. ఓఆర్ఆర్పై 19 చోట్ల ఇంటర్చేంజ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి కోర్ సిటీకి వెళ్లేందుకు 33 రేడియల్ రోడ్లు అందుబాటులో ఉన్నాయి. రైల్వే రింగు లైన్ను నిర్మిస్తే 19 ఇంటర్చేంజ్లతో పాటు 4 చోట్ల ఇప్పటికే ఉన్న రైల్వే మార్గాలను కలిపే అవకాశం ఉంది.
ఆ స్టేషన్లపై ఒత్తిడి తగ్గేలా
నగరంలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లపై ఇప్పటికే విపరీతమైన ఒత్తిడి ఉంది. పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా రైల్వే స్టేషన్ ప్రాంగణాలను విస్తరిస్తున్నా, భవిష్యత్ అవసరాలకు సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు శివారు ప్రాంతాల్లోనే రైల్వే టర్మినల్స్ను ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా రైళ్ల రాకపోకలు చాలా వేగంగా సాగేందుకు అవకాశం ఉంటుందని అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ నిపుణులు హెచ్ఎండీఏకు సూచించారు. ఇప్పటికే రెండు చోట్ల ఔటర్ రింగు రోడ్డు సమీపంలో శాటిలైట్ రైల్వే టర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలు చేయగా, అందులో చర్లపల్లి వద్ద పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. మరో టర్మినల్ను ఐటీ కారిడార్కు సమీపంలో కొల్లూరు- ఈదుల నాగులపల్లి వద్ద ఉన్న రైల్వే స్టేషన్ను శాటిలైట్ టర్మినల్గా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. వీటికి తోడు ఓఆర్ఆర్ చుట్టూ పట్టణ ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంఎంటీఎస్ తరహాలో రైల్వే సౌకర్యాన్ని కల్పించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి కేంద్ర రైల్వే శాఖతో సంప్రదించాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడితే మరో 4-5 ఏళ్లలో గ్రేటర్ చుట్టూ రైల్వే రింగ్ లైన్ నిర్మాణం సాధ్యమయ్యే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
శివారులో మరింత అభివృద్ధి
ఇప్పటికే ఓఆర్ఆర్ చుట్టూ విస్తరిస్తున్న నగర శివారు..రైల్వే రింగు లైను సాకారమైతే అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. ఐటీ కారిడార్ వైపు ఉన్న తెల్లాపూర్ నుంచి కొల్లూరు, శంకర్పల్లి, మోకిల, కొండకల్, భానూరు వంటి ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు, పరిశ్రమలు భారీ సంఖ్యలో వెలుస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం వైపు ఉన్న ఆదిభట్ల, మహేశ్వరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఐటీ, ఏరోస్పేస్తో పాటు ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ, ఈ-సిటీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్ వంటివి ఏర్పాటవుతున్నాయి. వీటికి తోడు వరంగల్-హైదరాబాద్ మార్గంలో యాదాద్రి వరకు నగరం విస్తరించేందుకు అవకాశం ఉంది. ఇలా నలువైపులా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో రైల్వే లైనును గ్రేటర్ చుట్టు ఏర్పాటు చేయడం వల్ల సులభంగా, వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.