Piyush Jain | కాన్పూర్కు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూశ్ జైన్ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత గురవారం నుంచి ఐటీ అధికారులు, జీఎస్టీ అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇంట్లో 120 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇంత సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ దాడుల్లో 257 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, కిలోల కొద్దీ బంగారంతో పాటు 16 కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాన్పూర్కు సంబంధించిన 4 పత్రాలు, కనూజ్కు చెందిన 7 పత్రాలు, ముంబైకి చెందిన 2 పత్రాలు, ఢిల్లీకి చెందిన ఒక పత్రాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా దుబాయ్కి చెందిన 2 ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు కనౌజ్ లో ఉన్న నివాసంలో 18 లాకర్లను అధికారులు కనిపెట్టారు. ఆ లాకర్లను ఓపెన్ చేయడానికి 500 రకాల తాళపు చెవులను ఉపయోగించినట్లు సమాచారం. పన్ను ఎగివేతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీయూశ్ జైన్ను అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పన్ను ఎగవేత, ఆస్తుల వివరాలు తదితర విషయాలపై ఆయన్ను ఈడీ, జీఎస్టీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూశ్ జైన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న ఐటీ, జీఎస్టీ అధికారులకు కునుకు తీయడానికి కూడా సమయం దొరకడం లేదట. నిరంతరాయంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నామని సోదాల్లో పాల్గొన్న ఓ అధికారి పేర్కొన్నారు. అసలు కునుకు తీయడానికి తమ వద్ద సమయం కూడా లేదని ప్రకటించారంటే… ఎన్ని నోట్ల కట్టలున్నాయో అర్థం చేసుకోవచ్చు. లాకర్ల తాళాలు తీయడం మొదలు.. పత్రాల పరిశీలన, వాటిని స్వాధీనం చేసుకోవడం అనే తంతు కొనసాగుతూనే ఉందని పేర్కొంటున్నారు. అయితే ఈడీ, జీఎస్టీ అధికారులకు స్థానిక పోలీసులు కూడా సహకరిస్తున్నారు. ఈడీ, జీఎస్టీ అధికారులు ఏమాత్రం కునుకు తీయకుండానే సోదాలు నిర్వహిస్తున్నారని, తాము మాత్రం అక్కడున్న కుర్చీల్లోనే కాసేపు మాత్రమే కునుకు తీసే పరిస్థితి ఉందని ఓ పోలీసుల తెలిపారు.