హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): శాస్త్ర, సాంకేతిక రంగంలో మున్ముందు సమూల మార్పులు వస్తాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. రానున్న 15 ఏండ్లలో భారత్ ఈ రంగంలో అగ్రస్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ప్రారంభమైన ‘విజన్ ఇండియా-2047’ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలు రెండు రోజులు జరుగుతాయి. ప్రభుత్వ ఆధీనంలోని 200కుపైగా పరిశోధనా సంస్థల డైరెక్టర్లు హాజరైన ఈ సమావేశంలో తొలి రోజు శాస్త్ర, సాంకేతిక మార్పులపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ఆరోగ్యం, నీరు, వ్యవసాయం, వాతావరణ మార్పులు, పర్యావరణంపై చర్చ జరిగింది. విజ్ఞాన భారతి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయంత్ సహస్రబుధే, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సీ మండే, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రటరీ రాజేష్ ఎస్ గోఖలే తదితరులు పాల్గొన్నారు.