Jana Gana Mana | ‘జనగణమన అధినాయక జయహే..’ గీతాన్ని గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ బెంగాలీలో రచించాడు. అయితే సంస్కృత ప్రభావం ఉన్న బెంగాలీ మాండలికమైన ‘సాధుభాష’ను ఎంచుకోవడం విశేషం.
జనగణమనకు ఎన్నో ప్రత్యేకతలు. ఇందులో ప్రయోగించిన పదాలు కూడా దేశ వ్యాప్తంగా అన్ని భాషల వారికి బాగా పరిచయం ఉన్నవి కావడం గమనార్హం. అందుకే అందరి ఆమోదాన్ని, ఆదరణను పొందగలిగింది. ఈ గీతాన్ని భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల సందర్భంగా 1911 డిసెంబర్ 27న కలకత్తాలో తొలిసారిగా ఆలపించారు. దీనిని 1912లో తత్వబోధిని పత్రికలో ‘భారత విధాత’ శీర్షికన ప్రచురించారు.
ఇక కలకత్తాకు బయట ‘జనగణమన’ను చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఉన్న బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో 1919 ఫిబ్రవరి 28న స్వయంగా రవీంద్రనాథ్ టాగూర్ ఆలపించారు. దేశం స్వాతంత్య్రం పొందిన 1947 ఆగస్టు 14 మధ్యరాత్రి రాజ్యాంగ సభ తొలిసారిగా ఒక సార్వభౌమ సంస్థగా సమావేశమైంది. ఆ సమావేశాన్ని ‘జనగణమన’ ఆలాపనతోనే ముగించారు. ‘జనగణమన’ను భారతదేశ జాతీయగీతంగా రాజ్యాంగ సభ 1950 జనవరి 24న అధికారికంగా స్వీకరించింది. జాతీయగీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకండ్లు తీసుకుంటే, తగ్గించిన భాగాన్ని పాడటానికి 20 సెకండ్లు పడుతుంది. జాతీయగీతం దేశ ప్రజలకు గర్వకారణం. జాతీయగీతానికి సంబంధించిన నైతిక నియమావళిని జాతి గౌరవ చట్టం, 1971లో పొందుపరచారు.
ఒక దేశం తన స్వతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని బలంగా ప్రకటించే ప్రతీకల్లో అతి ప్రధానమైనది జాతీయగీతం. భారతదేశంలో విభిన్నమైన భాషల వాళ్లు నివసిస్తున్నప్పటికీ జనగణమనను అందరూ సులువుగా అర్థం చేసుకుంటారు. దేశానికి వెన్నెముకగా నిలిచే సంప్రదాయాలు, విలువలను జాతీయగీతం చక్కగా అందిస్తుంది. భారతదేశ బహుళత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్క జనగణమన మాత్రమే కాదు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ జాతీయగీతం ‘అమార్ సోనార్ బంగ్లా’ కూడా టాగూర్ రాసిందే. అంతేకాదు శ్రీలంక జాతీయగీత రచనలోనూ రవీంద్రుడి ముద్ర కనిపిస్తుంది.