పెద్దపల్లి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో సాగురంగం సర్వనాశనమవుతుందని ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దుక్కి దున్నెటోడికే ఆకలిబాధ తెలుస్తుందన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు వచ్చిన నారాయణమూర్తిని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రాష్ర్టానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. ముందుచూపుతో వ్యవసాయరంగాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చేదాకా రైతులకు అండగా ఉంటున్నారని చెప్పారు. తాను నిర్మించిన రైతన్న సినిమాలో అన్నదాతల కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించానని వివరించారు. పెద్దపల్లి జిల్లాలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సినిమాను త్వరలోనే వీక్షించనున్నట్టు వెల్లడించారు.