హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపాలున్నాయని, అడుగడుగునా భద్రతా ప్రమాణాలు ఉల్లంఘిస్తున్నారని సెంటర్ ఫర్ లిబర్టీ మండిపడింది. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టు ఉనికికి, తద్వారా లక్షలాది ప్రజల ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వర్రావు విజయవాడ ఐలాపురం హోటల్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఎదునూరి శ్రీనివాస్రెడ్డి, నలమోతు చక్రవర్తి మాట్లాడారు.
అధికారిక రికార్డులు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), అంతర్జాతీయ నిపుణుల కమిటీ(పీవోఈ) నివేదికల ఆధారంగా ప్రాజెక్టులోని 5 కీలక వైఫల్యాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలవరం డ్యామ్కు అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో నాణ్యతా లోపాలున్నాయని, పగుళ్లను ప్లాస్టరింగ్ చేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆధారాలను ప్రదర్శించారు. అంతేకాకుండా వాల్ ఎత్తును, గ్యాప్-1 లోతును అనధికారికంగా కుదించారని, ఇది డ్యామ్ భద్రతకే పెనుముప్పని ఆందోళన వ్యక్తం చేశారు.
2023లో కొట్టుకుపోయిన స్పిల్వే గైడ్బండ్ పునర్నిర్మాణాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని, అది స్పిల్వే ఉనికికే ప్రమాదని హెచ్చరించారు. అప్రోచ్ చానల్ తవ్వకాలను అర్ధాంతరంగా నిలివేశారని వివరించారు. ‘ప్రభుత్వం ఇకనైనా ఏజెన్సీతో సంబంధం లేని స్వతంత్ర నిపుణుల కమిటీతో తనిఖీలు చేయించాలి. స్వతంత్ర క్వాలిటీ కంట్రోల్ యూనిట్ను నియమించాలి. పనులను నిర్దేశిత ప్రమాణాల మేరకు పూర్తిచేయాలి. కాంక్రీట్ పనులపై రోజువారీ నివేదికలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గైడ్బండ్ వైఫల్యానికి కారణమైన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు వెల్లడించారు.