‘చిత్రనిర్మాణం వెనుక ఎన్నో ఒత్తిళ్లు, కష్టాలుంటాయి. ఈ సినిమా ద్వారా కొత్త ప్రతిభను ప్రోత్సహించాననే సంతృప్తి ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తున్నాయి’ అని అన్నారు అగ్రహీరో విజయ్దేవరకొండ. ఆదివారం వైజాగ్లో జరిగిన ‘పుష్పకవిమానం’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనంద్ దేవరకొండ, గీత్సైనీ, శాన్వి మేఘన నాయకానాయికలుగా నటించారు. దామోదర దర్శకుడు. గోవర్ధన్రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘చిట్టిలంక సుందర్ పాత్రలో ఆనంద్ నా అంచనాలకు మించి నటించాడు.
ఈ సినిమా ద్వారా పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వారందరూ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నిర్మాతగా నేను పడిన కష్టాలన్నీ మరచిపోయాను. హీరోగా, నిర్మాతగా నవ్యమైన కథాంశాలతో మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలన్నదే నా ఆశయం’ అని తెలిపారు. ‘స్వీయప్రతిభతో ఇండస్ట్రీలో ఎదగమని అన్నయ్య ఎప్పుడూ చెబుతుంటాడు. ఆ మాటను దృష్టిలో పెట్టుకొని కథ, క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేశా’ అని ఆనంద్ దేవరకొండ అన్నారు. సుందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి కథ ఇదని, అతడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు నవ్వుల్ని పంచుతాయని దర్శకుడు పేర్కొన్నారు. మీనాక్షిగా తాను అభినయానికి ఆస్కారమున్న పాత్రను పోషించానని గీత్సైనీ చెప్పింది. ఈ కార్యక్రమంలో శాన్విమేఘన, మార్క్ కె రాబిన్ తదితరులు పాల్గొన్నారు.