శ్రీవల్లి పల్లెటూరి పడతి. పుష్పరాజ్ అనే యువకుడిపై మనసుపారేసుకుంటుంది. తన మదిలోని వెలకట్టలేని ప్రేమను, సరససల్లాప భావనలను ఓ జానపద గీతిక ద్వారా వ్యక్త పరచాలనుకుంటుంది. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ..నా సామీ..’ అంటూ ప్రియుడిని పొగడ్తల్లో ముంచెత్తుతూ ఓ వలపు గీతాన్ని అందుకుంటుంది. మరి ఈ పాటలో పల్లెటూరి పడచు జంట ప్రేమాయణం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అంటున్నది ‘పుష్ప’ చిత్ర బృందం. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలకానుంది.
ఈ సినిమాలో ఇటీవల విడుదలైన ‘సామీ నా సామీ..’ అనే జానపద శైలి గీతం సంగీతప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. సోషల్మీడియా వేదికల్లో అత్యధిక వీక్షణలతో దూసుకుపోతున్నది. గ్రామీణ యువతి ప్రణయభావాలకు అద్దం పడుతూ అందరిని ఆకట్టుకుంటున్నది. ‘కొప్పులోన పూలు కొడితే..గప్పున నువ్ పీల్చుకుంటే పూలగుండె రాలిపడదా సామీ..’ అనే చరణాలు సరికొత్త అభివ్యక్తితో అలరిస్తున్నాయి. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, దర్శకత్వం: సుకుమార్.