“పుష్ప’ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచింది. ఆల్టైమ్ బ్లాక్బస్టర్ హిట్గా కొత్త రికార్డులను సృష్టిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వారు నిర్మించిన తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీఈఓ చెర్రీ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమా చక్కటి వసూళ్లను రాబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 173 కోట్ల గ్రాస్ రాబట్టగా…దాదాపు 85 కోట్ల షేర్ వచ్చింది.
కేరళలో అల్లు అర్జున్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ను రాబట్టింది. మూడు రోజుల్లో ఆరు కోట్ల కలెక్షన్స్ను సాధించింది. తమిళనాడు 12 కోట్లు, కర్ణాటకలో 10, హిందీలో 14 కోట్లు కలెక్షన్స్వచ్చాయి. ఓవర్సీస్లో రెండు మిలియన్ల మార్క్ను టచ్ చేయబోతున్నాం. సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందని అనుకున్నాం. కానీ ఈ స్థాయి వసూళ్లను అంచనా వేయలేదు. మేము ఊహించని సక్సెస్ ఇది. హిందీలో రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. సోమవారం కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్ ఉండటం ఆనందాన్ని కలిగిస్తున్నది. ప్రస్తుతం ఈ విజయాన్ని సుకుమార్ పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ తర్వాత ఉత్తరాది ప్రేక్షకుల్ని మెప్పించిన దక్షిణాది చిత్రంగా ‘పుష్ప’ రికార్డులను సృష్టిస్తున్నది. సెకండ్పార్ట్ను ప్రారంభించడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. మంగళవారం తిరుపతిలో సక్సెస్మీట్ను ఏర్పాటుచేయబోతున్నాం.
ఇందులో చిత్రబృందం మొత్తం పాల్గొనబోతున్నారు’ అని తెలిపారు. ఛాయాగ్రాహకుడు మిరోస్లా క్యూబా బ్రోజెక్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం రెండేళ్లు అందరం శ్రమించాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫర్గా చాలెంజింగ్గా భావించి ఈ సినిమా చేశా. మంచి ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా ఉంది. సుకుమార్ లాంటి దర్శకులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సీన్లో పరిపూర్ణత కోరుకుంటారు. తాను సంతృప్తి చెందేవరకు ఎన్ని టేక్స్ అయిన తీసుకుంటారు’ అని తెలిపారు.