మేడ్చల్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతులు వర్షాకాలంలో పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా పదకొండు కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వానాకాలంలో పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు వచ్చే నెల 10వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించనుంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7,436 వేల క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసినట్లు ఫౌర సరఫరాల శాఖ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేనేజర్ రాజేందర్ వెల్లడించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లకు రూ.10 కోట్ల 50 లక్షలను రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన వడ్లకు రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా నగదును జమ చేస్తున్నారు. ఈ నెల చివరి వారం వరకు వరి కోతలు పూర్తి కానున్న నేపథ్యంలో వచ్చే నెల 10వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తామని, రైతుల పండించిన వడ్లను కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి.
యాసంగిలో కొనుగోలుపై కేంద్రం ద్వంద్వ వైఖరి
యాసంగిలో వడ్లు కొనేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కొనసాగిస్తున్న ఉద్యమానికి రైతులు మద్దతు ప్రకటిస్తున్నారు. వడ్ల కొనుగోలుపై బీజేపీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని స్పష్టంగా చెబుపుతున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ నాయకులు యాసంగిలో వరి వేయాలని రైతులను దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులకు దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించి యాసంగిలో వడ్లు కొనేలా చూడాలని రైతులు సవాళ్లు విసురుతున్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు రైతులకు మద్దతును ప్రకటిస్తున్నారు. రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్న బీజేపీకి రానున్న రోజులలో బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.