బెయిర్స్టో, లివింగ్స్టోన్ విజృంభణ.. బెంగళూరుపై కింగ్స్ ఘన విజయం ఐపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ బెర్తు దక్కించుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. లీగ్ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్ చావోరేవోలా మారింది. గెలిచి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుందామనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు గుమ్మరించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఆర్సీబీపై అద్భుత విజయం సాధించి తాము పోటీలోనే ఉన్నామని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది.
ముంబై: ప్లేఆఫ్స్ సమీపిస్తున్న సమయంలో మ్యాచ్లు రసపట్టులో సాగుతున్నాయి. కప్ కలను సాకారం చేసుకునేందుకు జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా 12 మ్యాచ్ల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో పంజాబ్ 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంటే..బెంగళూరు 14 పాయింట్లతో నాలుగులో ఉంది. తొలుత బెయిర్స్టో (29 బంతుల్లో 66, 4ఫోర్లు, 7 సిక్స్లు), లివింగ్స్టోన్ (42 బంతుల్లో 70, 5ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 209/9 స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ బెయిర్స్టో ఆది నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
దీంతో పవర్ప్లే ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ఓపెనర్ ధవన్ (21)తో కలిసి తొలి వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం భారీ స్కోరుకు బాటలు వేసింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (19) బ్యాటు ఝులిపించినా.. అనంతరం జితేశ్ శర్మ (9), హర్ప్రీత్ (7), రిషిధవన్ (7), రాహుల్ చాహర్ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. హర్షల్ పటేల్ (4/34)కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు..155/9 పరుగులకు పరిమితమైంది. మ్యాక్స్వెల్ (35), రజత్ పాటిదార్ (26) ఆకట్టుకున్నా..మిగతా బ్యాటర్ల వైఫల్యం ఆర్సీబీ కొంపముంచింది.
ముఖ్యంగా ఫామ్లేమితో సతమతమవుతున్న విరా ట్ కోహ్లీ (20) మరోమారు నిరాశపరిచాడు. ఓపెనర్గా వచ్చిన కోహ్లీ..రబాడ బౌలింగ్లో ఔటై తొలి వికెట్గా వెనుదిరిగాడు. రబాడ (3/21), రిషి ధవన్ (2/36), చాహర్ (2/37) ఆకట్టుకున్నారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన బెయిర్స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 209/9 (లివింగ్స్టోన్ 70, బెయిర్స్టో 66, హర్షల్ పటేల్ 4/34, డిసిల్వా 2/15), బెంగళూరు: 20 ఓవర్లలో 155/9 (మ్యాక్స్వెల్ 35, పాటిదార్ 26, రబాడ 3/21, రిషి ధవన్ 2/36)