ఆ టీచరమ్మ.. పట్టుదలకు పట్టుగొమ్మ. తాను బోధన సాగించే పాఠశాలలోని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది. సొంత నిధులు రూ.3 లక్షలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదింది. ఆమె మేడ్చల్ జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని దేవేందర్నగర్ స్కూల్ హెచ్ఎం కె.జయశ్రీ.. ప్రభుత్వ పాఠశాలకు ఆధునిక హంగులు కల్పించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గోడలపై పదాలు, జంతువులు, పక్షుల బొమ్మలు వేసి అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో విద్యా బోధన సాగేలా చర్యలు చేపట్టారు.
దేవేందర్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకప్పుడు సరైన వసతులు ఉండేవి కావు. భవనం, బెంచీలు, ఇతర సౌకర్యాలు అంతంత మాత్రమే ఉండేవి. పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయురాలు కె.జయశ్రీ పాఠశాల బాగు కోసం నడుంబిగించారు. సొంత నిధులు రూ.3 లక్షల వరకు వెచ్చించి పాఠశాలను సమూలంగా మార్చేశారు. తోటి ఉపాధ్యాయులు కూడా సంపూర్ణ సహకారం అందించడంతో పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. ఇపుడు కార్పొరేట్ పాఠశాలను తలపించేలా సకల హంగులతో కళకళాడుతున్నది. ప్రభుత్వం ప్రారంభించబోయే ‘మన ఊరు- మన బడి’ లక్ష్యాలకు నిలవుటద్దంలా నిలుస్తున్నది.
స్ఫూర్తి నింపేలా.. తరగతి గది..
విద్యార్థులు తరగతి గదిలోకి ప్రవేశించగానే కొత్త అనుభూతి కలిగేలా అలంకరించారు. గోడలపై ఆలోచింపజేసే పదాలు, జంతువులు, పక్షుల బొమ్మలు వేశారు. హరితహారంలో భాగంగా చెట్లను పెంచే ప్రాముఖ్యత గురించి ప్రహరీపై తీర్చిదిద్దారు. చదవడంతోపాటు నిత్యం వీటిని చూసి స్ఫూర్తి నింపేలా చక్కటి పెయింటింగ్తో నింపారు. విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ తరగతుల కోసం 32 అంగుళాల టీవీని పాఠశాలకు అందించారు.
లాక్డౌన్ సమయంలో..
కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించడంతో పాఠశాలలో చదువుకునే విద్యార్థుల బాగోగులు తెలసుకొని వారికి కావాల్సిన వస్తువులు అందజేశారు. ఆన్లైన్ పాఠాలకు దూరం కావొద్దనే ఉద్దేశంతో కొందరు విద్యార్థులకు మొబైల్ఫోన్లను అందించి తమ ఉదారతను చాటుకున్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ గురుకులాలు, నవోదయ ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.
ఆంగ్లమాధ్యమంతో ఉన్నతావకాశాలు
‘మన ఊరు…మన బడి’ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియాన్ని బోధించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. దీంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయి. పేద విద్యార్థులు కూడా బాగా చదివి ఉన్నత అవకాశాలు పొందుతారు. దేవేందర్నగర్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కార్పొరేట్కు దీటుగా మార్చడం సంతోషంగా ఉంది. పాఠశాల అభివృద్ధిలో తోటి ఉపాధ్యాయుల సహకారం చాలా ఉంది.
-కె.జయశ్రీ, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయురాలు