జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మోరంచపల్లి వరద బాధితులకు ప్రభుత్వం రూ.50లక్షల పరిహారం మంజూరు చేసింది. గురువారం మోరంచపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లకిడె కమలాబాయి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా హాజరయ్యారు. ప్రభుత్వం అందించిన రూ. 50లక్షల నుంచి ఒక్కో కుటుంబానికి రూ.15వేలు చొప్పున గ్రామంలోని సుమారు 330 మందికి చెక్కులు పంపిణీ చేశారు.
అలాగే వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.
అదేవిధంగా మోరంచ వరద ఉధృతికి గ్రామంలోని రోడ్లు తెగిపోగా, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా కలెక్టర్ రూ.30లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. వరదల్లో బర్రెలు మృతి చెందగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంటామని, బాధిత కుటుంబాలకు బర్రెలు కొనుగోలు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ 20 చెంచు కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఎకరం స్థలం కొనుగోలు చేసి ఆర్డీటీ సంస్థ ద్వారా ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.10వేల చెక్కులను ఇంటింటికీ పంపిణీ చేశామని, గ్రామస్తులకు నిత్యావసర సరుకులు అందించినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి మిక్సీ, గ్రైండర్, కుక్కర్లను అందజేశామని, జీఎంఆర్ ట్రస్టు ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి రూ.4వేలు ఆర్థిక సాయం, ఎస్సీ, ఎస్టీలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని, గ్రామంలోని 200 నిరుపేద కుటుంబాలకు గ్యాస్ స్టౌవ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇంతచేసినా ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ, ఎంపీపీ లావణ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని నర్సింగరావు, గణపురం పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.