న్యూఢిల్లీ, నవంబర్ 23: పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కల్పించడంపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని అన్నదాతలు చేస్తున్న డిమాండ్కు దేశంలోని మెజార్టీ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. రైతుల డిమాండ్ సహేతుకమేనని విపక్ష పార్టీల మద్దతుదారులతోపాటు అధికార ఎన్డీఏకి చెందిన సానుభూతిపరులూ స్పష్టంచేస్తున్నారు. ఐఏఎన్ఎస్, సీఓటర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు రైతన్నల డిమాండ్లకు మద్దతు పలుకడం విశేషం. నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీ ఇవ్వడంతోపాటు ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని, అప్పుడే తాము ఇండ్లకు వెళ్తామని ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజల మనోగతం ఏమిటన్నదానిపై ఈ సర్వే నిర్వహించారు.
అన్నదాతలు కోరిన విధంగా ఎంఎస్పీపై చట్టబద్ధమైన హామీని ఇవ్వాలని 61 శాతం మంది ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇందులో విపక్ష పార్టీల మద్దతుదారులతో పాటు అధికార ఎన్డీఏ సానుభూతిపరులు కూడా ఉన్నారు. ఎన్డీఏను సమర్థించేవారిలో 54 శాతం కంటే ఎక్కువ మంది ఎంఎస్పీ డిమాండ్కు మద్దతు ప్రకటించడం గమనార్హం. అయితే 21 శాతం మంది మాత్రం ఎంఎస్పీపై హామీకి వ్యతిరేకంగా ఓటేశారు.
మార్కెట్లో పంటల ధరలు పడిపోయినా, రైతులకు నష్టం కలుగకుండా ఉండేందుకు పంటలకు ప్రభుత్వం ఎంఎస్పీని నిర్ణయిస్తుంది. ఆ ధరకు రైతుల నుంచి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఫార్సులకు అనుగుణంగా ఏటా ఎంఎస్పీని నిర్ణయిస్తారు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి 23 రకాల పంటలకు ఎంఎస్పీని నిర్ణయిస్తున్నారు. పంట పండించడం నిమిత్తం పెట్టిన మొత్తం ఖర్చుతో సహా .. పెట్టిన పెట్టుబడిలో 50% కలిపి ఎంఎస్పీని నిర్ణయిస్తారు. కాగా దేశంలో 6% రైతులకే ఎంఎస్పీ అందుతున్నట్టు సమా
చారం.
ఆహార పంటలకు చట్టబద్ధమైన ఎంఎస్పీని ప్రకటించినట్టుగానే.. పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, కోళ్లు వంటి వాటికి కూడా చట్టబద్ధమైన ఎంఎస్పీని రైతులు డిమాండ్ చేస్తే తప్పకుండా మద్దతిస్తామని ఏకంగా 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. రికార్డు స్థాయిలో 63 శాతం కంటే ఎక్కువ మంది ఎన్డీఏ మద్దతుదారులు ఈ డిమాండ్కు సానుకూలంగా స్పందించడం విశేషం.
అన్ని పంటలను కేంద్రం కొనగలదు
ప్రస్తుతం 23 పంటలకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీని చెల్లిస్తున్నది. అయితే, ఎంఎస్పీ చెల్లించి అన్ని ఆహార పంటలను కూడా కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమేనన్న వాదనను మెజారిటీ ప్రజలు తోసిపుచ్చుతున్నారు. అన్ని పంటలకు ఎంఎస్పీని చెల్లించే స్థితిలో కేంద్రం ఉన్నదని 62.6 శాతం మంది అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన రైతు నేత సర్ ఛోటూరామ్ జయంతిని పురస్కరించుకొని బుధవారం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ దివస్గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది. ఢిల్లీ సరిహదుల్లో రైతుల నిరసనోద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించే మహా ధర్నాకు తమ నాయకులు పలువురు హాజరవుతారని వెల్లడించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఎస్కేఎం పోరాడుతున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్లో ప్రవాస భారతీయులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారని ఎస్కేఎం తెలిపింది.