రియో దె జెనీరో: కరోనా ఉంది బయటకి రావద్దు అంటే ఏకంగా లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైందని తపాళాలు బాది మరీ ఘోషించారు. బ్రెజిల్లో కరోనాను నియంత్రించడంలో అధ్యక్షుడు జైర్ బొల్సనారో విఫలమయ్యారంటూ బుధవారం పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు ఐదు లక్షల మంది బ్రెజిల్ పౌరులు కరోనాకు బలయ్యారు. గత కొన్నాళ్లుగా బొల్సనారో ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. కరోన కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూ ఉండడమే ఇందుకు కారణం. బుధవారం ఒక్కరోజే లక్షమంది బ్రెజిలియన్లకు కొత్తగా కరోనా సోకింది. 2,507 మంది కరోనాతో కన్నుమూశారు. గతంలో మాస్కులను ఎద్దేవా చేసిన బొల్సనారో అందరికీ వ్యాక్సిన్లు కావాలంటే ఏడాది చివరి వరకు ఆగాలని చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. పైగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూన్ లో అందుబాటులోకి వచ్చే టీకాల సంఖ్యను తగ్గించడం కూడా ప్రజల ఆగ్రహాని కారణం. బ్రెజిల్లోని అతిపెద్ద నగరమైన సావ్ పౌలోలో పెద్ద సంఖ్యలో జనం వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరిపారు. కొందరు విపక్ష నేత లూలా దాసిల్వా పటాలు పట్టుకున్నారు. మరికొందరు బొల్సనారోను రక్తపిపాసిగా చూపే బెలూన్లను పట్టుకున్నారు. అధ్యక్షునికి ప్రజల్లో తగ్గుతున్న ఆదరణకు ఈ ప్రదర్శనలు అద్దం పడుతున్నాయి. 2022లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బొల్సనారోతో దాసిల్వా తలపడతారని అంటున్నారు.