న్యూఢిల్లీ: మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో టీవీ యాంకర్ నవికా కుమార్పై కూడా దేశంలోని పలు చోట్ల కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత నుపుర్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోలో నవికా కుమార్ యాంకర్. ఈ నేపథ్యంలో నమోదు అయిన కేసుల్నీ ఒకే చోటుకు బదిలీ చేయాలని నవికా సుప్రీంను ఆశ్రయించింది. ఇవాళ ఆ పిటిషన్ను విచారించిన సుప్రీం.. నవికాపై ఉన్న కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా, కృష్ణ మురారీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. 8 వారాల పాటు నవికా కుమార్పై ఎటువంటి చర్యలు తీసుకోరాదు అని కూడా కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కేసుల కొట్టివేత విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా నవికా కుమార్కు సుప్రీం అవకాశం కల్పించింది. ఢిల్లీ పోలీసుశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజీ ఆపరేషన్స్(ఐఎఫ్ఎస్వో) ఈ కేసులో విచారణ చేపడుతుంది.