ముషీరాబాద్, జనవరి 29: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంతమాత్రం జాప్యం చేయకుండా జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. ఆదివారం ముషీరాబాద్ డివిజన్ కుమ్మరి బస్తీలో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బస్తీల్లో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుమ్మరి బస్తీలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రెండు దశాబ్దాలుగా గత పాలకులు డ్రైనేజీ పైపులైన్ల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లనే లీకేజీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. త్వరలో అన్ని బస్తీల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, ఎయిర్టెల్ రాజు, కొండా శ్రీధర్రెడ్డి, కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.