హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో పరిపాలన సాగించిన గత, ప్రస్తుత ప్రభుత్వాల లోపభూయిష్ట నిర్ణయాలు దక్షిణాది రైతులకు శాపంగా మారాయని దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘం ఆరోపించింది. ఉత్తరాది రైతుల మేలు కోసం దక్షిణాది రైతులను బలిచేశారని విమర్శించింది. రాజకీయాలకు అతీతంగా రైతులు, వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేసింది. బుధవారం హరితప్లాజాలో సంఘం అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పంజాబ్లో అమల్లో ఉన్న ధాన్యం సేకరణ విధానాన్ని ఇతర రాష్ర్టాలపై రుద్దడం వల్లనే సమస్యలు తలెత్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2014కు ముందు దేశవ్యాప్తంగా ఎఫ్సీఐ మిల్లర్ల సాయంతో రాష్ర్టాల నుంచి బియ్యం సేకరించగా, పంజాబ్లో మాత్రం నేరుగా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరించేదన్నారు. దీంతో కొంత నిధులు దుర్వినియోగం అయ్యేవని తెలిపారు. ఈ విధానాన్నే దేశవ్యాప్తంగా అమలు చేసి రాష్ర్టాలపై ఆ భారాన్ని మోపిందని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ధాన్యం సేకరణ విధానంలో మార్పులు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని రైతులు, మిల్లర్లు, వినియోగదారులకు మేలుచేసే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం బాయిల్డ్ రైస్ తీసుకోలేమని చెప్తున్న కేంద్రం భవిష్యత్తులో ధాన్యం సేకరణ నుంచి పూర్తిగా తప్పుకొనే అవకాశం కూడా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు ఈ సమావేశంలో ఆసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ, నవీన్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మద్దతు ధర చెల్లించి, నేరుగా మిల్లర్లే ధాన్యం కొని తద్వారా వచ్చే బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇచ్చేలా మార్పుచేయాలి. దీని ద్వారా అనవసరపు వ్యయాలు మిగిలి రైతులకు మద్దతు ధర కన్నా ఎక్కువ చెల్లించే అవకాశం ఉంటుంది. మద్దతు ధర అందుతున్నదో లేదో తెలుసుకునేందుకు రైతుబంధు సమితులు లేదా ఇతర పద్ధతుల ద్వారా ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలి. మిల్లర్లతో పాటు ఐకేపీ, పీఏసీ కేంద్రాలు కూడా ధాన్యం కొనుగోలు చెయ్యొచ్చు.
అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించాలి. స్థానిక, అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో అందిస్తే ఎగుమతులకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నారు.మార్కెట్లో బియ్యం విలువను పెంచేలా చర్యలు తీసుకోవాలి. పీడీఎస్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయాలి.