అడ్డగుట్ట, నవంబర్ 24 : తుకారాంగేట్లో జరుగుతున్న అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ. 29 కోట్లతో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఆర్యూబీ పనులు పూర్తవుతుండటంతో తుకారాంగేట్వాసుల దశాబ్దాల కల సాకారం కానుంది. రైల్వే శాఖ ద్వారా రూ.13.95 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.15.15 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టారు. రైల్వే శాఖ పనులు ఇప్పటికే పూర్తికాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ప్రాజెక్ట్ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ సకాలంలో ఆర్యూబీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ పనులు పూర్తి అయితే అడ్డగుట్ట, తుకారాంగేట్వాసులతో పాటు ఈ దారిగుండా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న గేటు సమస్య పరిష్కారం కానుంది. వీటితో పాటు ఆర్యూబీ పనులకు అనుసంధానంగా జరుగుతున్న స్టార్మ్ వాటర్ లైన్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి.
మారనున్న తుకారాంగేట్ రూపురేఖలు
అతిపెద్ద మురికివాడగా పేరొందిన అడ్డగుట్టలో మొట్టమొదటి సారిగా అత్యధిక నిధులతో ఆర్యూబీ పనులు చేపడుతుండడంతో రానున్నకాలంలో తుకారాంగేట్ రూపురేఖలు మారనున్నాయి. అడ్డగుట్ట ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఉమ్మడి ప్రభుత్వ హయాంలో ఇంతవరకు చెప్పుకోదగ్గ అభివృద్ధ్ది జరగలేదు. దశాబ్దాల సమస్యకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అడ్డగుట్ట డివిజన్ను డిప్యూటీ స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్, రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి ఆర్యూబీ పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, పద్మారావు పనితీరుపై తుకారాంగేట్వాసులు, వాహన దారులు,పాదచారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరగా అందుబాటులోకి తీసుకొస్తాం
ఆర్యూబీ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి నెల చివరి వరకు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. దానికనుగుణంగానే పనులను వేగిరం చేశాం. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి.