నయీంనగర్, డిసెంబర్12: తెలుగు బుక్ ఆఫ్ రికార్డును ప్రియాంక సుంకురుశెట్టి సొంతం చేసుకుంది. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి కళాశాలలో బీఫార్మసీ, హైదరాబాద్లో ఎం ఫార్మసీ పూర్తిచేసిన ప్రియాంక ప్రముఖ ఫార్మా కంపెనీ లీడ్ సీడీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నది. ఆ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ముందు తరాల వారికి తెలియజేయాలన్న సంకల్పంతో విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆస్ఫైర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడానికి 24 గంటల పాటు సన్ రైజ్ టు సన్ రైజ్ పేరుతో మారథాన్ లెక్చర్ నిర్వహించింది.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి సోమవారం ఉదయం 9.30 గంటలకు వరకు నిర్విరామంగా తెలుగు బుక్ ఆఫ్ జ్యూరీ మెంబర్ టీవీ అశోక్ కుమార్, అబ్జర్వర్లు నిమ్మల శ్రీనివాస్ ,వనపర్తి పద్మావతి ఇతర విషయ నిపుణుల సమక్షంలో కొనసాగించింది. సోమవారం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ త్వరలో 24 గంటల పాటు రికార్డు చేసిన సీడీలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం, వరల్డ్ రికార్డ్ కోసం పంపిస్తామని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన పెద్దల సమక్షంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్తోపాటు మెడల్, బ్యాడ్జి ని అందించి అభినందించారు. కార్యక్రమంలో ప్రియాంక తల్లిదండ్రులు నిర్మల బుచ్చయ్యతోపాటు బొమ్మినేని కృష్ణవేణి, చంద్రశేఖర్ రెడ్డి, సాగంటి మంజుల, వాగ్దేవి కళాశాల సిబ్బంది వాగ్దేవి ఫార్మసీ బోధన సిబ్బంది పాల్గొన్నారు.