పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పత్తిపాక జలాశయం నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ మేరకు గురువారం కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరద కాలువ రామచంద్రపురం నుంచి రామడుగు మండలం మీదుగా.. చొప్పదండి మండలం రేవెల్లి నుంచి సుమారు 7 కిలోమీటర్ల కాలువను తవ్వి పత్తిపాక జలాశయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు.
దీంతో టీఎంసీ నీటిని తరలించడానికి అవకాశం ఉందని మంత్రికి నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ జలాశయం నిర్మాణానికి రూ.230 కోట్ల వ్యయం అవుతుందన్నారు. కాగా, నిధుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మంత్రి ఆదేశించారు.