హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న క్రీడా పాలసీలో వ్యాయామ ఉపాధ్యాయుల(పీఈటీ)కు ప్రాధాన్యం కల్పిస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. దేశంలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం’ అని అన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులకు క్రీడా మైదానాల వద్ద దేహదారుఢ్య శిక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా పీఈటీ అసోసియేషన్.. మంత్రికి వివరించింది. వారి నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి అసోసియేషన్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాఘవరెడ్డి, కృష్ణమూర్తిగౌడ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, పీఈటీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సోమేశ్వర్రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.