చెన్నై: ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్కు భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద షాకిచ్చాడు. ఎయిర్థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో పదహారేండ్ల ప్రజ్ఞానంద.. కార్ల్సన్ను ఓడించి అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. ఎనిమిదో రౌండ్లో నల్లపావులతో బరిలో దిగిన ఈ యువ గ్రాండ్మాస్టర్ కార్ల్సన్ను 39 ఎత్తులతో చిత్తు చేసి ఔరా అనిపించాడు. ఈ టోర్నీలో కార్ల్సన్ వరుస విజయాలకు మనోడు బ్రేక్ ఇచ్చాడు. అంతకుముందు లెవాన్ అరోనియన్ను ఓడించి శుభారంభం చేసిన ప్రజ్ఞానంద అనంతరం నాలుగింటిలో ఓడి రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. అనిశ్ గిరి, క్వాంగ్ లియేమ్ లెతో ‘డ్రా’ చేసుకున్న ఈ యువ ఆటగాడు ఎరిక్ హంసేన్, డింగ్ లిరెన్, జాన్ క్రిజ్స్టఫ్, షక్రియార్ చేతిలో ఓడిపోయాడు. మొత్తంగా 8 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న భారత యువ జీఎం 12వ స్థానంలో నిలిచాడు. కార్ల్సన్ను ఓడించిన భారత గ్రాండ్మాస్టర్లలో విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ తర్వాతి స్థానంలో ప్రజ్ఞానంద నిలిచాడు.
కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానందను పలువురు ప్రముఖులు అభినందించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధ్యక్షుడు సంజయ్ కపూర్ అభినందించి ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ విజయం తనకు గర్వంగా ఉందని ప్రజ్ఞానంద గురువు ఆర్బీ రమేశ్ తెలిపాడు.
ప్రపంచ విజేత కార్ల్సన్ను ఓడించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తా. టోర్నీ తర్వాత కొద్దిగా విరామం తీసుకుని భవిష్యత్ టోర్నమెంట్లపై దృష్టి సారిస్తా. కార్ల్సన్తో ఆడిన గేమ్ కోసం ప్రత్యేక వ్యూహాలేమీ అమలు చేయలేదు. ఆడుతున్నంత సేపు ఒత్తిడికి గురవకుండా ఆటను ఆస్వాదించా.
– ప్రజ్ఞానంద, భారత జీఎమ్