వరంగల్, డిసెంబర్ 14: కార్పొరేషన్ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని దివ్యాంగుడు సయ్యద్ అసద్ గ్రేటర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్పొరేషన్ కార్యాలయం పోర్టికో ఎదుట ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్తో వచ్చిన ఆయన ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే పక్కన ఉన్న వారు అతడిని అడ్డుకున్నారు.
సమాచారం తెసుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని అసద్ను అదుపులోకి తీసుకున్నారు. కాశీబుగ్గకు చెందిన సయ్యద్ అసద్ ఇల్లు, ఖాళీ స్థలం కొంత మంది కబ్జా చేశారని వాపోయాడు. తన ఇంటి నంబర్ను హోల్డ్లో పెట్టించి ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టకుండా చేస్తున్నారని చెప్పారు. దీనిపై వందలసార్లు అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.
అధికారులు కబ్జా చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. తల్లిదండ్రులు చనిపోయారని అక్క వద్ద ఉంటున్నానని వివరించాడు. దీనిపై కోర్టుకు వెళ్తే తీర్పు తనవైపు వచ్చిందని, అయినా కార్పొరేషన్ అధికారులు కబ్జా చేసిన వారికి సహకరిస్తున్నారని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని అసద్ కోరాడు.