ఓదెల : బుధ, గురువారాల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ఓదెల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, మానేరు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నీరు ప్రవహిస్తున్న లోలెవెల్ కాజ్వే దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్సై చెప్పారు. జలాశయాలు, చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ను తాకవద్దని సూచించారు. గ్రామాలలో చేపల వేటకు ఎవరూ వెళ్ళవద్దని, రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోని విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని కోరారు. వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతాలను సందర్శించవద్దన్నారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయట రావద్దని, వరద ప్రవాహల వద్ద బందోబస్తులో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించి, వారి సూచనలు పాటించాలని ఎస్సై కోరారు.