హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ/బంజారాహిల్స్: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినందున అన్ని రకాల పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సోమవారం అన్ని యూనివర్సిటీలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఆదేశాలు జారీచేశారు. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో సోమవారం నుంచి ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తరగతుల నిర్వహణను ఉపసంహరించుకున్న విద్యాసంస్థలు పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న ఉన్నత విద్యామండలి అధికారులు అన్ని రకాల పరీక్షలను వాయిదావేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో జేఎన్టీయూ, ఉస్మానియా, బీఆర్ఏవోయూల్లో జరుగాల్సిన పరీక్షలను వాయిదావేస్తున్నట్టు యూనివర్సిటీలు ప్రకటించాయి. ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరుగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీనగేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని అన్ని పరీక్షలను కూడా వాయిదా వేసినట్టు ఆ వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు.