హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించే విషయంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన నూతన పోస్ట్మార్టం ప్రొటోకాల్ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసులు మినహా మిగతా సందర్భాల్లో రాత్రిపూట పోస్టుమార్టం చేయవచ్చని తెలిపింది. అవయవదానానికి సంబంధించిన పోస్టుమార్టానికి ప్రాధాన్యం ఇచ్చి, సరైన సదుపాయాలు ఉన్న దవాఖానల్లో సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం చేయవచ్చని వెల్లడించింది. రాత్రిపూట నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయాలని, భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ఇవి ఆధారంగా నిలుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు అన్ని దవాఖానల సూపరింటెండెంట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.