ఒక పక్క ఒళ్లు గగుర్పొడియే యుద్ధ సన్నివేశాలు.. మరోపక్క ఆమెను మర్చిపోలేకపోతున్నాననే ఆవేదన.. అందమైన సినిమాటోగ్రఫీ.. వీటికితోడు మెస్మరైజ్ చేసే మణిరత్నం డైరెక్షన్.. అందుకే ‘‘పొన్నియిన్ సెల్వన్’’ టీజర్ చూసిన అభిమానుల చూపు తిప్పుకోలేకపోతున్నారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరో చియాన్ విక్రమ్ అస్వస్థతతో ఆస్పత్రి పాలవడంతో టీజర్ లాంచ్ చేస్తారా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. వీటన్నింటికీ పుల్స్టాప్ పెట్టిన చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది. వివిధ భాషల్లో అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు, మోహన్ లాల్, సూర్య, రక్షిత్ శెట్టి వంటి సూపర్ స్టార్లు డిజిటల్గా దీన్ని విడుదల చేశారు.
10వ శతాబ్దంలో చోళ రాజుల మధ్య పవర్ స్ట్రగుల్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమిళ రైటర్ కల్కి రచించిన ప్రఖ్యాత నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణిరత్నం ప్యాషన్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.