హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ విద్యార్థులు 38 రోజులుగా సాగించిన పోరాటం ఫలించింది. అధ్యాపకుల సహాయ నిరాకరణ ఉద్యమ సెగ తగలడంతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలు, శక్తి(కార్మిక)శాఖలో ఉద్యోగుల విలీనం చేయాలన్న నిర్ణయాలపై వెనక్కి తగ్గింది. దాదాపు జీవో 97 రైద్దెనట్టే లెక్క.
పాలిటెక్నిక్ కాలేజీలు.. సాంకేతిక విద్యా పరిధిలో(ప్రభుత్వ) ఉంటాయని.. సాంకేతిక విద్యాశాఖ, సాంకేతిక విద్యామండలిలు యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. డిప్లొమా కోర్సుల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదని.. ఏఐసీటీఈ అంశాలు, పరీక్ష విధానాలు పాత పద్ధతిలోనే ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఆదివారం పాలిటెక్నిక్ జేఏసీ నేతలకు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు సమాచారం ఇచ్చారు. దీంతో పాలిటెక్నిక్ విద్యలో నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది.
పాలిటెక్నిక్ విద్య విలీనం, జీవో 97పై ఉర్రూతలూగిన విద్యార్థి ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు కేశవరావు అధ్యక్షతన హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తొలుత అధ్యాపక జేఏసీ నేతలతో చర్చించింది. శనివారం బషీర్బాగ్లో ని ఎస్సీఈఆర్టీ ఆడిటోరియంలో విద్యార్థులతో చర్చలు జరిపింది. విద్యార్థులు పదులకొద్దీ ప్రశ్నలను కమిటీ ముందుంచారు. వారు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరై సమాధానాలు చెప్పలేకపోయారు.
పాలిటెక్నిక్ను ఇతర వ్యవస్థల్లో విలీనం చేస్తే కోర్సులు, పరీక్షలు, ఏఐసీటీఈ గుర్తింపు, ఉద్యోగుల భవిష్యత్తు, విద్యార్థుల ప్రయోజనాలపై స్పష్టతనివ్వాలని కోరారు. విద్యార్థులు పాలిటెక్నిక్ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, శక్తిశాఖలో విలీనం చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టంచేసిన నేపథ్యంలో కేకే ఆదివారం సీఎంతో భేటీ అయ్యారు. ఓ సమగ్ర నివేదికను అందజేశారు. పాత విధానంలోనే కొనసాగించాలని, విలీనం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సూచించినట్టు సమాచారం.
జీవో 97ను నిరసిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు 37రోజులపాటు పోరాడారు. కాలేజీలన్నీ విద్యార్థుల ఉద్యమంతో హోరెత్తాయి. అధ్యాపకులు కూడా సహాయ నిరాకరణ చేశారు. హైలెవల్ కమిటీ వేశాక విద్యార్థులు వెనక్కి తగ్గుతుందని ప్రభుత్వం భావించింది కానీ విద్యార్థులు ఎక్కడా రాజీపడలేదు. శాంతియుతంగా ఉద్యమించారు. విలీనాన్ని ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. ఊహించని ఈ ఒత్తిడితో సర్కార్ ఉక్కిరిబిక్కిరై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ మేరకు సహకరించిన హైలెవల్ కమిటీ చైర్మన్ కేకే, సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్, శాంతాసిన్హా, నవీన్ మిట్టల్, సాంకేతిక విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన, శక్తి శాఖ కమిషనర్ హరిచందనకు పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ జనరల్ శ్రావణ్కుమార్, కో చైర్మన్ అభినవ్, కన్వీనర్ సురేశ్, శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు.