గంజాయిపై పోలీసులు పంజా విసురుతున్నారు. ‘మత్తు’ మూలాలు వెలికితీస్తున్నారు. శనివారం సైతం వివిధ చోట్ల తనిఖీలు నిర్వహించి..స్మగ్లర్లు, విక్రేతలను అరెస్టు చేశారు. భారీగా సరుకును స్వాధీనం చేసుకున్నారు.
మారేడ్పల్లి, అక్టోబర్ 30: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్లలో అక్రమంగా గంజాయిని ముంబైకి తరలించేందుకు యత్నిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే డీఎస్పీ చంద్రభాను, జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీను, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ నర్సింహలతో కలిసి వివరాలు వెల్లడించారు. ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయిని సేకరించి ముంబైకి తరలించేందుకు ప్రయత్నించిన థానే గాంధీనగర్కు చెందిన హాజీ మస్తాన్ రంజాన్ షేక్ (36), ఒడిశా కరాచాబాదీ గ్రామానికి చెందిన నీరమల్లిక్ (26), రాజు మల్లిక్ (28), అదే ప్రాంతానికి చెందిన లకాయా మల్లిక్ (19), మహారాష్ట్ర సాయిబాబా చహాల్కు చెందిన సుభాన్ హైదర్ షేక్, ఒడిశా గజపతి జిల్లా కర్భాబాది గ్రామానికి చెందిన ప్రేమనంద మల్లిక్ (23)లను శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై పట్టుకున్నారు. వీరి నుంచి 3 ట్రాలీ బ్యాగుల్లో 27 ప్యాకెట్లలో ఉన్న 54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా- ఏపీ సరిహద్దుల నుంచి గంజాయిని ముంబైకి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా, జూలై 27న జన్మభూమి ఎక్స్ప్రెస్ రైల్లో ఒడిశా నుంచి లింగంపల్లికి తరలిస్తున్న 15 కిలోలు, అక్టోబర్ 9న గరీభ్థ్ ఎక్స్ప్రెస్లో 13 కిలోల గంజాయిని పట్టుకున్నామని డీఎస్పీ చంద్రభాను వివరించారు. మొత్తంగా 82 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు
వెల్లడించారు.
మంగళహాట్లో…
గంజాయి విక్రయిస్తున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని మంగళహాట్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో జాయింట్ కమిషనర్, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ రవితో కలిసి వివరాలు వెల్లడించారు. ఆకాశ్ సింగ్(32), చింటుసింగ్(22) లోయర్ ధూల్పేట ఝాన్సీ చౌరాహి ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆకాశ్ విశాఖపట్నంకు చెందిన సత్య తేజ వద్ద కిలో గంజాయిని రూ.2వేలకు కొని.. రూ.4వేల నుంచి రూ. 5వేల వరకు నగరంలో అవసరమున్న వారికి చింటు సింగ్ ద్వారా అమ్ముతున్నాడు. శనివారం ఆగాపురాలో ఆకాశ్ కారులో గంజాయిని తరలిస్తుండగా, పోలీసులకు పట్టుబడ్డాడు. చింటు, సత్యతేజలు పారిపోయారు. నిందితుడి వద్ద 20 కిలోల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అరకు నుంచి హైదరాబాద్కు..
సరూర్నగర్ ఎక్సైజ్శాఖ సిబ్బంది శనివారం ఎల్బీనగర్ చౌరస్తాలో అరకు నుంచి హైదరాబాద్కు 3 కిలోల ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇమ్రాన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్రావు తెలిపారు. అరకులో రూ. 4వేలకు గంజాయిని కొనుగోలు చేసి.. నగరంలో రూ. 20వేలకు అమ్ముతున్నట్లు చెప్పారు.
గంజాయి తాగుతుంటే..
అబ్దుల్కలాం పార్కు వద్ద గంజాయి తాగుతున్న కేపీహెచ్బీ కాలనీకి చెందిన బొమ్మి మానస్ అఖిల్(25), అల్లాపూర్కు చెందిన మద్దిరాల గోవింద్ (25), బోరబండకు చెందిన మోర్తా నికేశ్ (25)లను శనివారం కేపీహెచ్బీకాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయిని విక్రయించిన అబ్బాస్ ఆలీ పారిపోయాడు. నిందితుల వద్ద పది గ్రామలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.