హైదరాబాద్ : మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు( Evolving Challenges ) అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు డీజీపీ సి. వి. ఆనంద్ ( DGP C.V. Anand) తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధ వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా, ప్రస్తుతం డ్రగ్స్ ( Drugs ), సైబర్ నేరాలు( Cyber Crimes ) , ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు పోలీసులకు కొత్త సవాళ్లుగా మారాయని వెల్లడించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ తదితర ప్రత్యేక విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎనిమిది విభాగాలకు అవసరాలకు అనుగుణంగా కేటాయించామని వివరించారు. వీరిలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్సైలు, 14 మంది ఏఎస్సైలు, 84 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు.
కొత్త బాధ్యతలు అప్పగించే ముందు సిబ్బందిని వివిధ విభాగాల్లో రెండు నెలల పాటు అటాచ్మెంట్పై పనిచేయించామని అన్నారు. ప్రభుత్వ అనుమతితో ఆయా విభాగాల్లో పోస్టుల ఏర్పాటు ఆధారంగా తుది కేటాయింపులు చేశామన్నారు.కొత్త విభాగాల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీలో 11 రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు .
యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని డీజీపీ అన్నారు. గతేడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిపారు. డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిగా అడ్డుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను ఇప్పుడే కాపాడుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సైబర్ నేరాల్లో రూ.1,750 కోట్ల నష్టం
సైబర్ నేరాలు మరో ప్రధాన సవాలుగా మారాయని డిజిపి తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, నకిలీ యాప్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తాజా పునర్వ్యవస్థీకరణలో రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. తెలిపారు. గత ఏడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మూడు నెలల అనంతరం సిబ్బంది అవసరాలు, పనితీరును మరోసారి సమీక్షిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆక్టోపస్, సీఐడీ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ తదితర ప్రత్యేక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.