రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య గంటకుపైగా ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం అందుకున్న బలగాలు వారి కోసం ఉసూర్ పోలీస్స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేపట్టాయి. బలగాలను గమనించిన మావోలు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ప్రతిగా కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని, నక్సలైట్ల కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డట్లు బీజాపూర్ ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ తెలిపారు.
మావోలు మృతదేహాలను ఇంకా వెలికి తీయాల్సి ఉందని పేర్కొన్నారు. నక్సలైట్లపై పక్కా సమాచారం వచ్చిందని, ఈ మేరకు వారి కోసం భద్రతా బలగాలు అన్వేషించాయని చెప్పారు. బలగాల రాకను గమనించి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారని చెప్పారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని తెలిపారు. తప్పించుకొని పారిపోయిన వారికి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.