బంజారాహిల్స్, డిసెంబర్ 1: కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకుల భద్రత కోసం జీహెచ్ఎంసీ, అటవీశాఖ నడుం బిగించింది. ఇటీవల సినీనటి షాలూ చౌరాసియాపై దాడి జరగ్గా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. పార్కు లోపల, జీహెచ్ఎంసీ వాక్వేలో వాకింగ్ చేసే వారితో పాటు సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ, అటవీశాఖ, నగర పోలీసులు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ సూచనలు చేశారు. ఈ మేరకు బుధవారం పార్కు వద్ద వెస్ట్జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, అదనపు డీసీపీ సిద్దిఖీ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఎంసీ ఇస్లావత్ సేవానాయక్తో పాటు ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు సమావేశమయ్యారు. వాకర్ల భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం ప్రణాళికలు రూపొందించి నెల రోజుల్లో వాటిని అమలు చేయాలని నిర్ణయించారు.
పటిష్టంగా నిఘా..
పార్కు లోపల అటవీ శాఖ ఏర్పాటు చేసిన 34 కెమెరాలు పని చేస్తుండగా.. జీహెచ్ఎంసీ వాక్వేలో ఏర్పాటు చేసిన 70 కెమెరాల్లో 17 మాత్రమే పని చేస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు రానున్న నెల రోజుల్లో వాటికి మరమ్మతులు చేయించనున్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఉన్న వాక్ వే మొత్తాన్ని కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
కేబీఆర్ పార్కు లోపలికి వచ్చేందుకు మొత్తం 10 గేట్లు ఉన్నాయి. ఇందులో కొన్ని గేట్లు పాడవడంతో ఎవరు పడితే వారే లోపలికి వెళ్తున్నారు. ఇది గుర్తించిన అధికారులు అన్ని గేట్లకు మరమ్మతులు చేయించాలని.. అవసరమున్న చోట్ల కొత్త గేట్లు పెట్టాలని నిర్ణయించారు.
జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న వాక్వేలోకి ప్రతిరోజు ఉదయం 4.45 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు ప్రవేశించేందుకు అవకాశం ఇస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ తరుపున ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పెంచి వాకర్లకు ఇబ్బందులు కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. n జీహెచ్ఎంసీ వాక్వేలోకి రాత్రి 8 గంటల వరకే వాకర్లను అనుమతించాలన్న అభ్యర్థనలు దృష్టి పెట్టుకోవడంతో పాటు పార్కులోని వాకర్లను చీకటి పడే లోగా బయటికి పంపే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
పార్కు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఉన్న వాకింగ్ ట్రాక్పై లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు వాక్వేలో సుమారు 100 నుంచి 120 దాకా వీధి దీపాలు అవసరం పడుతాయని అధికారులు గుర్తించారు. అంతేకాక వాక్వేలో గుబురుగా ఉన్న పొదలను కత్తిరించడంతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెంచనున్నారు.
కేబీఆర్ పార్క్లో 512 నెమళ్లు
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్కులో 512 నెమళ్లు ఉన్నట్లు అటవీశాఖాధికారులు ప్రకటించారు. డిసెంబర్ 3న కేబీఆర్ పార్కు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దక్కన్ బార్డర్స్ ఎన్జీవో, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ల సహకారంతో అధికారులు బుధవారం నెమళ్ల గణనను నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 3న అటవీ శాఖాధికారులు నెమళ్లను లెక్కిస్తున్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ ఎంజే అక్బర్, డీఎఫ్వో జోజి, డీఎఫ్వో ఎఫ్ఎస్పీ హైదరాబాద్, రిటైర్డ్ డిప్యూటీ సీఎఫ్ శంకరన్, ఎన్జీవోలు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ ఫండ్ సంస్థలకు చెందిన 35 మంది సభ్యులు పాల్గొన్నారు.