కరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ ముఠాకు సంబంధించి ఇద్దరు దొంగలను ఇప్పటికే పోలీసుల అదుపులోకి తీసుకోవడం, మిగిలిన వారికోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రెస్మీట్ పెట్టనున్నారని పోలీసు వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 3న దోపిడీ దొంగలు నగల షాపును లూటీ చేసి సవాల్ విసరగా, పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అన్ని కోణాల్లోనూ లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ర్టాల్లో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న విషయం బయటకు వచ్చింది. అయితే ఈ ఇద్దరే చిక్కారా..? ఇంకా పోలీసుల చేతిలో ఎవరైనా ఉన్నారా..? అన్నది గురువారం బహిర్గతం కానున్నది. అలాగే, నగల షాపులో ఎత్తుకెళ్లిన నగల విలువ ఎంత అన్నది ఇప్పటివరకు స్పష్టంగా బయటకు రాలేదు. కిలో నుంచి నాలుగు కిలోల ఆభరాణాలు పోయినట్టు రకరకాలుగా వార్తలు వస్తుండగా, నేడు సీపీ నిర్వహించే ప్రెస్మీట్కు ప్రాధాన్యత సంతరించుకున్నది.