ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ అయినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశ్నించారు. దీని గురించి ప్రధాని మోదీ వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ దీనిపై శనివారం స్పందించారు. మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. ముస్లిం వ్యక్తి లేదా కార్యకర్తను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ముడిపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. నవాబ్ మాలిక్ ముస్లిం కావడంతోనే దావూద్, ఆయనకు మధ్య సంబంధాలను అంటగట్టారని దుయ్యబట్టారు. మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను డిమాండ్ చేస్తున్న బీజేపీ, కేంద్ర మంత్రి రాణే అరెస్ట్ అయినప్పుడు ఆయన రాజీనామాను ఎందుకు కోరలేదు అని శరద్ పవార్ ప్రశ్నించారు.
మరోవైపు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తన కుమారుడు, ఎమ్మెల్యే నితీష్ రాణేతో కలిసి ముంబైలోని మలవాణి పోలీస్ స్టేషన్కు శనివారం హాజరయ్యారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసిన కేసులో ముంబై పోలీసులు ప్రశ్నించారు.