హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ.. తెలంగాణ అమరవీరులను స్మరించుకొని, సంతాపం ప్రకటించింది. 11.35 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సభావేదికకు చేరుకొన్నారు. వేదికపై ఏర్పాటుచేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. వేదికపై ఆసీనులైన తరువాత సీఎం కేసీఆర్కు హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టారు. అమరవీరులను, దివంగతులైన సీనియర్ నేతలు, మేధావులను స్మరించుకొంటూ సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 20 ఏండ్ల పార్టీ ప్రస్థానంలో తమతో అనేకమంది కలిసి పనిచేశారని, వారిలో నిబద్ధత కలిగిన నాయకులు కొందరు కీర్తిశేషులయ్యారని చెప్పారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం వారు అందించిన సేవలను పార్టీ గౌరవంగా స్మరించుకుంటుందని వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. జీవిత సర్వస్వాన్ని తెలంగాణ కోసమే అంకితం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్రావు, నాయిని నర్సింహారెడ్డి, శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్రెడ్డి, మాజీమంత్రులు మాధవరం సుదర్శన్రావు, అజ్మీరా చందులాల్, సోలిపేట రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య, మాలెం మల్లేశ్, కావేటి సమ్మయ్య, కావేటి లక్ష్మీనారాయణ, పీ మాణిక్యరెడ్డి, ఎడ్మ కృష్ణారెడ్డి, ఎంఏ బేగ్తోపాటు పలువురు కార్యకర్తల మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు.