న్యూఢిల్లీ, మార్చి 29: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ స్పెక్ట్రం ధర, వేలం విధివిధానాలపై టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సిఫార్సులు త్వరలో రాబోతున్నాయి. మరో వారం, పది రోజుల్లో విడుదలవుతాయని మంగళవారం ట్రాయ్ కార్యదర్శి వీ రఘునందన్ పీటీఐకి తెలిపారు. రకరకాల శ్రేణుల్లోని రేడియో తరంగాలను ఈ దఫా వేలం వేస్తున్నందున లోతైన విశ్లేషణలతో సిఫార్సులను సిద్ధం చేయాల్సి వస్తున్నదని, అయినప్పటికీ ఈ ప్రక్రియ తుది దశకు చేరుకున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే వారం, పది రోజుల్లో సిఫార్సులు వస్తాయన్నారు. అయితే టెలికం పరిశ్రమలో మాత్రం గురువారంలోగానే ట్రాయ్ సిఫార్సులు రావచ్చన్న అంచనాలుండటం విశేషం. వివిధ బ్యాండ్లలోని స్పెక్ట్రం వేలం కోసం విధివిధానాల చర్చకు ఓ సమగ్ర సంప్రదింపుల పత్రాన్ని నిరుడు నవంబర్ ఆఖర్లో ట్రాయ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తద్వారా స్పెక్ట్రం విలువ, రిజర్వ్ ధర, పరిమాణం, వేలంలో పాల్గొనేందుకు అర్హతలు, పరిమితి, స్పెక్ట్రం సరెండర్కు సంబంధించి టెలికం పరిశ్రమ వ్యాప్తంగా చర్చకు ఆహ్వానించింది. కాగా, 5జీ మొదలైతే ప్రస్తుత 4జీ కంటే వేగంగా ఇంటర్నెట్ సేవలు, డౌన్లోడ్ స్పీడ్ను మొబైల్ వినియోగదారులు పొందగలరు.
కొత్త తరంగాలు
526-698 మెగాహెట్జ్ వంటి కొత్త ఫ్రీక్వెన్సీలు, మిల్లీమీటర్ బ్యాండ్ 24.25-28.5 గిగాహెట్జ్ కోసం కూడా ట్రాయ్ ఈసారి నిబంధనల్ని విడుదల చేస్తున్నది. అలాగే 700, 800, 900, 1800, 2100, 2300, 2500, 3300-3670 మెగాహెట్జ్ తరంగాల వేలానికి సిఫార్సులు రానున్నాయి. చివరిసారిగా నిరుడు మార్చిలో స్పెక్ట్రం వేలం జరిగింది. మొత్తం 2,308.8 మెగాహెట్జ్ల స్పెక్ట్రంను వేలానికి పెట్టగా, 855.6 మెగాహెట్జ్ల స్పెక్ట్రమే అమ్ముడుపోయింది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రూ.77,814.8 కోట్లతో దక్కించుకున్నాయి. ఇందులో 488.4 మెగాహెట్జ్ల స్పెక్ట్రం కోసం జియో అత్యధికంగా రూ.57,122.7 కోట్లతో బిడ్ దాఖలు చేసింది.